అగస్టా కేసులో ఛార్జ్షీట్ లీక్ బీజేపీ తీరుపై కాంగ్రెస్ ఫైర్
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బంది తలెత్తింది. అగస్టా వెస్ట్ల్యాండ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేసింది. 2 వేల పేజీల ఛార్జ్షీట్లో నిందితులుగా మరో మూడు పేర్లు చేర్చిన ఈడీ.. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పేరును పరోక్షంగా ప్రస్తావించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఛార్జ్షీట్లోని ఒక పేజీని లీక్ చేయడాన్ని బీజేపీ ఎలక్షన్ స్టంట్గా అభివర్ణించింది.
కల్యాణ్ సింగ్ మెడపై కోడ్ కత్తి:ఈసీ నివేదికను హోంశాఖకు పంపిన రాష్ట్రపతి, చర్యలు తీసుకొనేందుకే మొగ్గు
నాలుగవ సప్లిమెంటరీ చార్జ్షీట్
అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాల్గో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఢిల్లీ స్పెషల్ కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో ఢిపెన్స్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా సిబ్బంది, కాంగ్రెస్కు చెందిన రాజకీయ ప్రముఖలకు ముడుపులు అందాయన్న విషయాన్ని ప్రస్తావించింది.
మైఖేల్ జరిపిన లావాదేవీల వివరాలు
కుంభకోణానికి సంబంధించి 2008 ఫిబ్రవరి నుంచి 2009 అక్టోబర్ మధ్యలో అగస్టా కేసులో ప్రధాన నిందితుడు క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ జరిపిన లావాదేవీలను ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. అగస్టా డీల్ను సోనియా ముందుండి నడిపారని, ప్రధాని కార్యాలయం, రక్షణ శాఖలోని పలువురు ఆర్థికశాఖపై ఒత్తిడి తెచ్చారని స్పష్టం చేసింది. క్రిస్టియన్ మైఖేల్ ఇటాలియన్ లేడీ కొడుకుతో సమావేశం కావాలనుకున్న విషయం దర్యాప్తులో తేలిందన్న ఈడీ పరోక్షంగా రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించింది.
41కి చేరిన నిందితులు
స్పెషల్ కోర్టు జడ్జి అరవింద్ కుమార్కు సమర్పించిన చార్జ్ షీట్లో ఈడీ మరో ముగ్గురు పేర్లను నిందితులుగా చేర్చింది. దీంతో కేసులో నిందితుల సంఖ్య 41కి చేరింది. మైకేల్ బిజినెస్ పార్ట్నర్ అయిన డేవిడ్ నీగెల్ జాన్ సిమ్స్తో పాటు మెస్సర్స్ గ్లోబల్ ట్రేడ్ అండ్ కామర్స్ లిమిటెడ్, మెస్సర్స్ గ్లోబల్ సర్వీసెస్ ఎఫ్జెడ్ఈ, యూఏఈ కంపెనీలకు అగస్టా స్కాంతో సంబంధముందని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది.
ఈడీ తీరుపై కాంగ్రెస్ ఫైర్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలుచేసిన ఛార్జ్షీట్లోని ఒక పేజీ లీక్ కావడంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. అన్ సర్టిఫైడ్ పేజీ లీక్ చేయడాన్ని తప్పుబట్టింది. మోడీ ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాణ్దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఛార్జ్షీట్ లీకేజీని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఎలక్షన్ స్టంట్ అని విమర్శించారు.