స్కూల్లో షూటౌట్: కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని రక్షించిన పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ పాఠశాలలో గన్ షూటింగ్ కలకలం రేగింది. తుపాకులు చేతబట్టిన ముగ్గురు కిడ్నాపర్లు సోమవారం ఘజియాబాద్ పబ్లిక్ స్కూల్లో చొరబడ్డారు. దీంతో తుపాకులతో స్కూల్లోకి ప్రవేశించిన కిడ్నాపర్లను చూసిన పిల్లలు, టీచర్లు భయంతో పరుగులు తీశారు.
ఘజియాబాద్లోని రాజ్ నగర్లో ప్రాంత సమీపంలో ఉన్న పార్కులో ఆదివారం సాయంత్రం ఆడాడుకుంటున్న జైకరణ్ మహాజన్ అనే బాలుడిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి, పక్కనే ఉన్న రాయల్ కిడ్స్ ప్లే స్కూల్లోని సర్వెంట్ క్వార్టర్స్లో ఉంచారు. అనంతరం కిడ్నాపర్లు అక్కడి నుంచే బాలుడి తండ్రికి ఫోన్ చేశారు.
రూ. 2 కోట్లిస్తేనే నీ కుమారుడిని వదిలేస్తామని, లేనిపక్షంలో కాల్చి చంపేస్తామని బెదిరించినట్లు బాలుడి తండ్రి వివరించాడు. అంతేకాదు ఈ ఊహించని ఘటనతో తొలుత షాక్ తిన్న అతడు వెనువెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్కూలును చుట్టుముట్టారు. క్షణాల్లో స్కూల్ లోపలికి వెళ్లి, కిడ్నాపర్లు ఉన్న గది తలుపులను బద్దలు కొట్టి, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం మొత్తం 20 నిమిషాల వ్యవధిలో పోలీసులు ముగించారు.
అనంతరం జై కరన్ కిడ్నాప్ ఉదంతాన్ని వివరిస్తూ.... 'నన్ను కారులో తీసుకెళ్లి, ఒక ఇంట్లో దాచారు. తుపాకితో బెదిరించి, బాగా కొట్టారు. వాళ్ల అమ్మ నన్ను విడిచిపెట్టమని అంటే ఆమెను కూడా తిట్టారు. తుపాకి గురిపెట్టి ఆమెను భయపెట్టారు. తరువాత ఏదో ఇంజక్షన్ ఇచ్చారని ఆ తరువాత తనకేమీ తెలియదని' పోలీసులకు వివరించాడు.
ఈ వ్యవహారంలో స్కూలు యాజమాన్యాన్ని, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు శని, ఆదివారాలు స్కూలుకు సెలవు కావడంతో బాలుడి కిడ్నాప్ విషయం తమ దృష్టికి రాలేదని స్కూలు యాజమాన్యం చెబుతోంది. మరోవైపు తమ కుమారుడు క్షేమంగా తిరిగి రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
నిందితుల వద్ద నుంచి .32 కాలిబర్ పిస్టోల్స్తో పాటు నాలుగు రౌండ్ల మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో బాలుడు జైకరణ్ మహాజన్ 8వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం.