లొకేషన్లు మార్చి.. చెరుకుతోటలో దాచి, శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ వ్యవహారం
ఢిల్లీలో రాష్ట్ర వైద్య విద్యార్థి శ్రీకాంత్గౌడ్ కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర వైద్య విద్యార్థి శ్రీకాంత్గౌడ్ కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిన దుండగులు 13 రోజుల పాటు హరిద్వార్, ముజఫర్నగర్, మీరట్, బులంద్షహర్ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు.
చివరకు మీరట్లోని శతాబ్దినగర్లో వీరు పట్టుబడ్డారు. అయితే వీరిలో నలుగురు నిందితులు మాత్రమే పట్టుబడగా.. ప్రధాన నిందితుడైన క్యాబ్ డ్రైవర్ సుశీల్ అతడి తమ్ముడు అనుజ్లు మాత్రం దొరకలేదు.
శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితులైన క్యాబ్ డ్రైవర్ సుశీల్ అతడి తమ్ముడు అనుజ్, మరో నిందితుడు వివేక్ కోసం గాలిస్తున్నట్లు ఢిల్లీ ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ రవీందర్ యాదవ్, ఏసీపీ రాహుల్ గురువారం వెల్లడించారు. శ్రీకాంత్ను రక్షించే ఆపరేషన్లో పాల్గొన్న సుమారు 200 మంది పోలీసు సిబ్బందికి వారు అభినందనలు తెలిపారు. పట్టుబడిన నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
తొలిసారి క్యాబ్ బుక్ చేసి.. బుక్కయ్యాడు..
శ్రీకాంత్ ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో విధులు ముగించుకుని, రాత్రి 11 గంటల సమయంలో తన నివాసానికి వెళ్లడానికి ప్రీత్విహార్ మెట్రోరైల్ స్టేషన్కు వెళ్లాడు. అప్పటికే చివరి రైలు వెళ్లిపోయింది. దాంతో గత్యంతరం లేక ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అతడి జీవితంలో.. క్యాబ్ బుక్ చేసుకోవడం కూడా అదే తొలిసారి. చివరికి తాను బుక్ చేసుకున్న క్యాబ్ లో తానే కిడ్నాపయ్యాడు.
అపహరణకు .. పక్కా స్కెచ్
అప్పటికే ఓలా క్యాబ్ డ్రైవర్ సుశీల్.. తన క్యాబ్ లో ఎక్కిన ఎవరినైనా కిడ్నాప్ చేసి, ఓలా యాజమాన్యం నుంచి డబ్బులు డిమాండ్ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. అనుకోకుండా అతడికి శ్రీకాంత్ గౌడ్ బుకింగ్ వచ్చింది. దీంతో శ్రీకాంత్ను ప్రీత్విహార్ మెట్రోరైలు స్టేషన్లో ఎక్కించుకున్న సుశీల్.. తన అనుచరులున్న ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ మరో కారులో ఉన్న సుశీల్ తమ్ముడు అనుజ్, అతడి బావమరిది ప్రమోద్, స్నేహితులు సోన్వీర్, అమిత్, వివేక్.. అందరూ కలసి శ్రీకాంత్ గౌడ్ ను కిడ్నాప్ చేశారు. క్యాబ్లో ఉన్న జీపీఎస్ను, వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను స్విచాఫ్ చేసేశారు. శ్రీకాంత్ ఫోన్ నుంచే ఓలా యాజమాన్యానికి ఫోన్ చేసి.. శ్రీకాంత్ను కిడ్నాప్ చేశామని, రూ.5 కోట్లు ఇస్తేనే వదిలేస్తామని డిమాండ్ చేశారు.
పోలీసుల సంప్రదింపులు.. ట్రాక్ చేసేందుకు ప్రయత్నాలు
శ్రీకాంత్ కిడ్నాప్ వ్యవహారంపై ఓలా సంస్థ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... రూ.5 కోట్లు ఇస్తామని, శ్రీకాంత్కు ఎలాంటి హానీ తలపెట్టవద్దంటూ సంప్రదింపులు ప్రారంభించారు. ఇదే సమయంలో కిడ్నాపర్లను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత కిడ్నాపర్ల నుంచి ఫోన్లు రావడం ఆగిపోయింది.
పోలీసులపై రెండుసార్లు కాల్పులు...
శ్రీకాంత్ను తీసుకుని దాదాపు 13 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగిన కిడ్నాపర్లు.. ఆదివారం ముజఫర్నగర్ పరిసరాల్లోని చెరుకు తోటల్లోకి వచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లగా.. కిడ్నాపర్లు పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. అక్కడి నుంచి కిడ్నాపర్లు మీరట్లోని శతాబ్దినగర్కు వెళ్లారని బుధవారం ఉత్తరప్రదేశ్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసు లు శ్రీకాంత్ను ఉంచిన ఇంటిని చుట్టుముట్టారు. కొందరు సిబ్బంది ఇంట్లోకి వెళ్లి శ్రీకాంత్ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించగా.. కిడ్నాపర్లు మరోసారి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. మొత్తానికి పోలీసులు శ్రీకాంత్ను క్షేమంగా కాపాడి.. కిడ్నాపర్ల బృందంలోని సోన్వీర్, అమిత్, ప్రమోద్, గౌరవ్శర్మలను అరెస్టు చేశారు. వీరిలో ప్రమోద్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రధాన నిందితుడు సుశీల్, అనుజ్, వివేక్ల కోసం గాలిస్తున్నారు.
ప్రాణాలతో వస్తాననుకోలేదు.. కృతజ్ఞతలు...
కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడిన వైద్య విద్యార్థి శ్రీకాంత్గౌడ్.. గురువారం కేంద్ర మంత్రి దత్తాత్రేయను కలసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్ కిడ్నాపైనప్పటి నుంచి దత్తాత్రేయ తరచూ పోలీసు ఉన్నతాధికారులతో చర్చిస్తూ.. ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకున్నారు. ఈ అంశంపై సహాయం చేయాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు ఆయన లేఖలు కూడా రాశారు. కిడ్నాపైన తర్వాత తాను తిరిగి ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు. ఈ ఘటనతో తీవ్రంగా భయపడ్డానని చెప్పారు. తనను రక్షించిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
తప్పుడు పత్రాల గుర్తింపులో విఫలమయ్యాం: ఓలా సంస్థ
తమ సంస్థతో క్యాబ్ అటాచ్మెంట్ కోసం డ్రైవర్ సుశీల్ తప్పుడు పత్రాలు సమర్పించాడని.. ఆ విషయాన్ని గుర్తించడంలో తాము విఫలమయ్యామని ఓలా సంస్థ అంగీకరించింది. ఓలా సంస్థకు క్యాబ్లను అటాచ్ చేసే ఏజెంట్ ద్వారా నకిలీ పత్రాలు సమర్పించిన సుశీల్.. ఈ నెల 4వ తేదీ నుంచి క్యాబ్ సర్వీసులు ప్రారంభించి, ఆ తరువాత రెండ్రోజులకే.. 6వ తేదీన శ్రీకాంత్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఓలా సంస్థ కార్పొరేట్ వ్యవహారాల చీఫ్ బండార్కర్ మీడియాతో మాట్లాడారు. కిడ్నాపర్ సమర్పించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్కార్డు వివరాలన్నీ నకిలీవేనని.. ఆ విషయం గుర్తించడంలో తాము విఫలమయ్యామని చెప్పారు. ఢిల్లీలో శ్రీకాంత్ గౌడ్ కిడ్నాప్ ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే దేశవ్యాప్తంగా క్యాబ్ల అటాచ్మెంటును తాము నిలిపివేశామని... అటాచ్మెంట్కు ఉన్న నిబంధనల్లో ఎక్కడ లోపం ఉందో పరిశీలిస్తున్నామని బండార్కర్ తెలిపారు.