లాక్ డౌన్ దెబ్బ.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన యువకుడు... పత్రికా ప్రకటన...
అతని వయసు 28 ఏళ్లు.. అప్పు రూ.91లక్షలు... లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆస్తులు కూడా ఏమీ మిగల్లేదు. దీంతో ఏకంగా తన కిడ్నీనే అమ్మకానికి పెట్టాడు. ఇందుకోసం ఓ కశ్మీర్ వార్తా పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. సబ్జర్ అహ్మద్ ఖాన్ అనే ఆ యువకుడు ఇచ్చిన ప్రకటన జమ్మూకశ్మీర్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే... కుల్గాం జిల్లా నుసు గ్రామానికి చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్ కారు డీలర్గా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ కూడా అయిన ఖాన్ ఇటీవలి కాలంలో వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. కశ్మీర్లో ఆర్టికల్ 370 తర్వాత కర్ఫ్యూ విధించడం,ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఖాన్ తీవ్ర నష్టాలను చవిచూశాడు. ఆఖరికి చేతిలో చిల్లిగవ్వ మిగలకపోగా... బ్యాంకులకు రూ.61లక్షలు,ఇతరులకు రూ.30లక్షలు బాకీ పడ్డాడు.
అప్పులు తీర్చేందుకు ఆస్తులు కూడా ఏమీ మిగలకపోవడంతో ఇక తన కిడ్నీనే అమ్మకానికి పెట్టాలనుకున్నాడు. ఇందుకోసం ఓ కశ్మీరీ పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి కొంతమంది తనను సంప్రదించినట్లు ఖాన్ వెల్లడించాడు. అయితే కిడ్నీ కోసం ఒకరు కేవలం రూ.20లక్షలు,మరొకరు రూ.25లక్షలు చెల్లిస్తామని ముందుకొచ్చారని... అందుకు తాను ఒప్పుకోలేదని చెప్పాడు. ఎవరైనా ఇంకా రేటుతో ముందుకొస్తారేమోనని ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.కిడ్నీ అమ్మకానికి పెట్టిన విషయాన్ని ఇంట్లో కూడా చెప్పానని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకుమించి తనకు మరో మార్గం లేదని వాపోయాడు.
కాగా,ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే. దేశంలోని చిన్న,మధ్యతరగతి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. అన్ని రకాల ఉత్పత్తులు,వినియోగం పడిపోవడంతో చాలావరకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిన్న,మధ్య తరగతి వ్యాపారులు,వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం ఆత్మనిర్భర్ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.