జమ్మూకాశ్మీర్: అమరజవాను ఇంటికెళ్లిన నిర్మలా సీతారామన్, ‘వారే స్ఫూర్తి’
శ్రీనగర్: ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన అమర జవాను ఔరంగజేబు కుటుంబసభ్యులను కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పరామర్శించారు. జమ్మూకాశ్మీర్లోని రాజౌరి ప్రాంతంలో నివసిస్తున్న ఔరంగజేబు కుటుంబసభ్యులను ఆమె కలుసుకొని కొద్దిసేపు వారితో మాట్లాడారు.
ఈ సందర్భంగా నిర్మలా సీతారామణ్ మాట్లాడుతూ.. 'అమరవీరుడి కుటుంబసభ్యులతో కాసేపు సమయాన్ని గడిపేందుకు ఇక్కడికి వచ్చాను. వీళ్ల దగ్గర నుంచి ఓ చక్కటి సందేశాన్ని నాతో తీసుకువెళ్తున్నాను. అమరజవాను మాతో పాటు, దేశానికే స్ఫూర్తిగా నిలిచారు' అని అన్నారు.
కాగా, ఔరంగజేబు తండ్రి కూడా ఆర్మీలో తన సేవలను అందించారు. రంజాన్ పండుగ సందర్భంగా రాజౌరిలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు అతడిని అడ్డగించి అపహరించుకుపోయి, అనంతరం దారుణంగా హత్య చేశారు. అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
#WATCH: Defence Minister Nirmala Sitharaman meets the family of Sepoy Aurangzeb in J&K's Poonch. Aurangzeb was abducted from Pulwama by terrorists and later his bullet-ridden body was recovered on June 14, #JammuAndKashmir pic.twitter.com/xv2sobrq18
— ANI (@ANI) June 20, 2018
తన కొడుకును చంపిన వాళ్లని 72గంటల్లోగా కేంద్రం పట్టుకొని కాల్చేయాలని.. జమ్మూకాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులను, ఉగ్రవాదులను రాష్ట్రం నుంచి తరిమివేయాలని ఆయన తండ్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఔరంగజేబును హత్య చేయడానికి ముందు ఉగ్రవాదులు అతడిని ఓ అజ్ఞాత ప్రదేశానికి తరలించి.. పలు ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత ఔరంగజేబు తల, మెడపై కాల్చి చంపారు.