నాపై చేసిన ఘాటు వ్యాఖ్యలు వినేందుకు: కిరణ్ బేడీ బహిరంగ లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కృష్ణా నగర్ నుండి పోటీ చేసిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ సోమవారం నాడు దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అందులో ఆమె తన ఆవేదనను చెప్పారు.
తాను ఎన్నికల రాజకీయ పరీక్షలో ఓడిపోయానని చెప్పారు. తన ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అన్నారు. శక్తివంచన లేకుండా విజయం కోసం తాను కృషి చేశానని చెప్పారు. తన పట్ల చేసిన ఘాటైన వ్యాఖ్యలు వినేందుకు తన తల్లిదండ్రులు జీవించి లేరని చెప్పారు.
తాను ఎన్నికల్లో పాల్గొంది తనకు అధికారం కోసం కాదన్నారు. ఢిల్లీకి సేవ చేసేందుకు ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. తాను 40 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నానని చెప్పారు. ఈ నగరంలో తాను ఎన్నో సవాళ్లను చూశానని చెప్పారు. మహిళల రక్షణ కోసం తాను తనవంతు చేశానని చెప్పారు.
గ్రామాలకు చెందిన యువత ద్వారా పెట్రోలింగ్ చేయించానని, అంతేకాకుండా తాను వారంలో ఐదు రోజులు వెళ్లానని చెప్పారు. పాఠశాలలకు వెళ్లని చిన్నారులను స్కూళ్లకు పంపించేలా చేశానని చెప్పారు. అందులో ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులుగా, ఇతర వృత్తుల్లో ఉన్నారని చెప్పారు.
తాను ఎన్నో చేశానని అవన్ని పేరు కోసం చేయలేదన్నారు. సేవగా భావించి చేశానని, అలాగే పరిస్థితులు చేపించాయని చెప్పారు. ఢిల్లీకి ఎంతో చేయాలని తాను ఎన్నికల బరిలో దిగానని చెప్పారు. తాను అపరాధిలో ఎప్పుడు ఉండదల్చుకోలేదని అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల పరీక్షలో తాను ఓడానని, తనదే బాధ్యత అన్నారు. అయితే, అంతర్గతంగా తాను ఓడినట్లుగా భావించడం లేదన్నారు. తక్కువ సమయం దొరికిందని అభిప్రాయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సవాల్ను స్వీకరించేందుకు ముందుకు రారన్నారు.