అధిష్టానంపై తగ్గని కిరణ్: టిపై రామ్దేవ్, మోడీపై శపథం
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఓ వైపు కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణ బిల్లును వచ్చే పార్లమెంటులో సమావేశాలలో ప్రవేశ పెట్టాలని ప్రయత్నాలు చేస్తుండగా.. బిల్లును అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీలో రాజ్యసభ ఎన్నికల భరిలో కేంద్రంతో సంబంధం లేకుండా స్వతంత్రగా అభ్యరులను నిలబెట్టాలా? వద్దా? అన్న అంశంపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో కేంద్రానికి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్ధులను నిలబెట్టాలని గంటా, ఏరాసు, జెసిలు తమ వాదనను గట్టిగా వినిపించారట.
కేంద్రానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్ధులను గెలుపించుకోవడం ద్వారా సమైక్య గళాన్ని గట్టిగా వినపించవచ్చని వారు భావిస్తున్నారు. రెబల్ అభ్యర్ధిగా పోటీకి దిగడానికి జెసి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఈ ముగ్గురు నేతలు తెలిపారు.
వెనక్కి పంపాల్సిందే: కిరణ్
తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపించాల్సిందేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పలువురు సీమాంధ్ర నేతలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. నోటీసు మీద ఓటింగ్ జరుగుతుందని, సోమవారం నుండి ఎనిమిది గంటలలోగా సభలో ఉండాలని, సీమాంధ్ర ఎమ్మెల్యేలు సకాలంలో సభకు వచ్చేలా చూడాలని మంత్రులకు సూచించినట్లుగా సమాచారం. బిల్లు ఎక్కడిదైనా, ఏదైనా అసెంబ్లీలో నిబంధనలు వర్తిస్తాయని వారికి చెప్పారట. బిల్లును ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పంపించాల్సిందేనని చెప్పారు.
పొన్నాల లేఖ
గవర్నర్ నరసింహన్కు, సభాపతి నాదెండ్ల మనోహర్కు, చైర్మన్ చక్రపాణిలకు మంత్రి పొన్నాల లక్ష్మయ్య లేఖ రాశారు. సభాపతి, చైర్మన్లకు తీర్మానం కోసం ముఖ్యమంత్రి లేఖ రాయడం అభ్యంతరకరమని అందులో పేర్కొన్నారు. కిరణ్ తీరు సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. కేబినెట్లో చర్చించకుండా నోటీసు ఎలా ఇస్తారన్నారు. కిరణ్ ఇచ్చిన లేఖను తిరస్కరించాలని/తిరస్కరించేలా చూడాలని కోరారు.
ఎపి విభజన, మోడీపై రామ్దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెసు పార్టీ లబ్ధి పొందాలని చూస్తోందని ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేసి తెలంగాణను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రాజకీయ అరాచకానికి కాంగ్రెసు పార్టీయే కారణమని మండిపడ్డారు. తెలంగాణ రావాలని, అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగాల్సి ఉందన్నారు.
భారతీయ జనతా పార్టీకి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తన మద్దతు పూర్తిగా ఉంటుందని ఆయన చెప్పారు. తాను మోడీ కోసం, బిజెపి కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తానని తెలిపారు. మోడీ ప్రధానమంత్రి అయితే హిందూ - ముస్లింలు ఇరు వర్గాలతో పాటు అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
మోడీ అధికారంలోకి రావడం ప్రమాదకరమని కాంగ్రెసు పార్టీ భయపెడుతోందని, ముస్లీం ఓట్లు రాబట్టుకునేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. నల్లధనం, అవినీతిని రూపుమాపడంలో మోడీ సమర్థంగా పని చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మోడీకి దేశవ్యాప్తంగా మద్దతు పెంచి ప్రధాని సీట్లో కూర్చోబెడతానని శపథం చేశారు.