కిల్లోస్కర్ కంపెనీ ఎండీ కొడుకు కిడ్నాప్
బెంగళూరు: ప్రసిద్ధి చెందిన కిర్లోస్కర్ కంపెనీ ఎండీ వినాయక్ బాపట్ కుమారుడు ఇషాన్ బాపట్ (19)కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. కిడ్నాపర్ల చెర నుంచి ఇషాన్ క్షేమంగా బయటపడటంతో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
మీనాక్షీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇషాన్ విద్యాభ్యాసం చేస్తున్నాడు. బైక్ సర్వీస్ కు ఇచ్చిన ఇషాన్ మంగళవారం సాయంత్రం బీఎంటీసీ బస్సులో ప్రయాణించి యలహంకలో బస్సు దిగాడు. బస్సు దిగగానే కారులో వచ్చిన ఇద్దరు నిందితులు ఇషాన్ ను కిడ్నాప్ చేశారు.
తరువాత రాత్రి 8 గంటలకు ఇషాన్ తల్లికి ఫోన్ చేసి నీ కొడుకును కిడ్నాప్ చేశామని చెప్పారు. పోలీసులకు చెబితే ఇషాన్ ను చంపేస్తామని హెచ్చరించారు. ఈషాన్ కుటుంబ సభ్యులు సిద్దరామయ్య ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు.
బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇషాన్ కోసం గాలించారు. మొదట వైట్ ఫీల్డ్ సమీపంలో ఇషాన్ ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ తో గుర్తించారు. వైట్ ఫీల్డ్ కు చేరుకున్న పోలీసులు గాలిస్తున్న సమయంలో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ మాయం అయ్యాయి.
పోలీసులకు చిక్కిపోతామని భయపడిన కిడ్నాపర్లు చివరికి బెంగళూరు శివార్లలోని జాలహళ్ళి దగ్గర బుధవారం ఇషాన్ ను వదిలి పెట్టి మాయం అయ్యారు. ఇషాన్ క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.