కేజ్రీతో జైట్లీ గొడవ: బిజెపి నుంచి కీర్తి ఆజాద్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ పైన ఆ పార్టీ అధిష్టానం బుధవారం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డిడిసిఎ) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పైన కీర్తి ఆజాద్ విరుచుకుపడుతోన్న విషయం తెలిసిందే. జైట్లీ తన పైన పరువు నష్టం దావా వేయాలని కూడా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కీర్తి పైన బిజెపి కఠిన చర్యలు తీసుకుంది.
డిడిసిఎ వ్యవహారం కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య వేడిని రాజేస్తోన్న విషయం తెలిసిందే. డిడిసిఎలో అరుణ్ జైట్లీ ఉండగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఇలాంటి సమయంలో కీర్తి ఆజాద్ సొంత పార్టీ మంత్రి జైట్లీ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది బిజెపిని ఇరుకున పెడుతోంది. దీంతో, బిజెపి పెద్దలు చర్చించిన అనంతరం ఆయన పైన వేటు వేశారు.