కిసాన్ క్రాంతి పాదయాత్ర: ఢిల్లీలోకి రాకుండా వాటర్ కెనాన్, టియర్ గ్యాస్ ప్రయోగం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని సీతారామ్ ఏచూరి నిప్పులు చెరిగారు. ఇప్పుడు రైతుల ఆందోళన ద్వారా మరోసారి అది నిరూపితమైందన్నారు. రైతులకు ప్రభుత్వం ఎలాంటి ఊరట ఇవ్వడం లేదని ఆరోపించారు.
డిమాండ్లు తీర్చండి: ఢిల్లీలో కదం తొక్కిన యూపీ రైతులు...పరిస్థితి ఉద్రిక్తం
పైగా రైతులు నష్టపోతున్నారన్నారు. వారు అప్పుల్లో కూరుకుపోతున్నారని వాపోయారు. ఒత్తిడిలో ఆత్మహత్యల వరకు వెళ్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతుల దుస్థితిని ఇలా చూడలేదని వాపోయారు.
ఢిల్లీ కిసాన్ క్రాంతి యాత్ర హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పోలీసులు రైతులను ఢిల్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారీకేడ్లను తోసుకుంటూ రైతులు ముందుకెళ్లే ప్రయత్నాలు చేశారు. రైతులపై వాటర్ క్యానన్స్, బాష్పవాయువును పోలీసులు ప్రయోగించారు. రుణమాఫీ, మద్దతు ధర కోరుతూ రైతులు ఢిల్లీని ముట్టడించే ప్రయత్నాలు చేశారు.
ఢిల్లీ వెళ్లే రహదారులను మూసివేశారు. తూర్పు, ఈశాన్య ఢిల్లీలో 144వ సెక్షన్ విధించారు. ఢిల్లీ - యూపీ సరిహద్దుల్లోనే కిసాన్ యాత్రను అడ్డుకున్నారు. రైతులు ట్రాక్టర్లతో బారీకేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు.
రుణమాఫీ, మద్దతు ధరతో పాటు ఉచిత విద్యుత్, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయాలని, ఎన్సీఆర్లో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనే పలు డిమాండ్లతో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో రైతు సంఘం నేతలతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు.
#WATCH Visuals from UP-Delhi border where farmers have been stopped during 'Kisan Kranti Padyatra'. Police use water cannons to disperse protesters after protesters broke the barricades pic.twitter.com/9KUwKgvrwW
— ANI (@ANI) October 2, 2018
ఢిల్లీలోకి రాకుండా వేలాదిమంది రైతులను పోలీసులు బారీకేడ్లతో అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ రైతులు పది రోజులుగా మహాపాదయాత్ర చేపట్టి ఢిల్లీకి చేరుకున్న సమయంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ నుంచి సెపటెంబర్ 23న కిసాన్ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి యూపీలోని పలు ప్రాంతాల మీదుగా అక్టోబర్ 2న ఢిల్లీలోని కిసాన్ ఘాట్ చేరుకోవాలనుకున్నారు.