కిసాన్ పరేడ్ .. సింఘూ, తిక్రీ , ఘాజీపూర్ బోర్డర్ లో ఉద్రిక్తత .. పోలీసుల టియర్ గ్యాస్ ప్రయోగం
దేశ రాజధాని ఢిల్లీలో ఒకపక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగుతుండగా, మరో పక్క రైతుల ఉద్యమం, రైతులు సాగిస్తున్న ట్రాక్టర్స్ ర్యాలీకి బోర్డర్ లో సర్వం సిద్ధం అయ్యాయి.కనీవినీ ఎరుగని రీతిలో భారీ బందోబస్తుతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినప్పటికీ, వేలాది మంది రైతులు బారికేడ్లను తొలగిస్తూ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో నిరసనకారులను అదుపు చేయడం కోసం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు.
రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత కిసాన్ పరేడ్ .. భారీగా ఢిల్లీ బోర్డర్ లో ట్రాక్టర్లు
ఢిల్లీలోని సింఘూ సరిహద్దు, తిక్రీ సరిహద్దు వద్ద రైతుల ట్రాక్టర్స్ ర్యాలీ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో దేశ రాజధానిలోకి ప్రవేశించి కిసాన్ పరేడ్ నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దేశ రాజధానిలో పరేడ్ కు సిద్ధమవుతున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ట్రాక్టర్ ర్యాలీ - కిసాన్ పరేడ్ - మధ్యాహ్నం 12 గంటల తరువాత జరపాలని, రిపబ్లిక్ డే పరేడ్ కు ఆటంకం కలిగించవద్దని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు .
సింఘూ బోర్డర్ వద్ద బారికేడ్లని దాటుకుని లోనికి ట్రాక్టర్లు .. టియర్ గ్యాస్ ప్రయోగం
అయితే, ఉదయం 8 గంటలకు సరిహద్దుల్లో భారీగా జనం తరలివచ్చారు.సింగు సరిహద్దు సమీపంలో 5,000 మందికి పైగా నిరసనకారులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింపులో భాగంగా పెద్ద ఎత్తున రైతులు ర్యాలీ నిర్వహించడానికి బారికేడ్లను దాటుకొని వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు . మరోపక్క ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతమైన తిక్రి వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలకు కవాతు ప్రారంభమైన తరువాత ప్రశాంతంగా ఉండాలని రైతు సంఘాల నాయకులు నిరసనకారులను కోరారు.
తిక్రీ , ఘాజీపూర్ వద్ద కూడా కొనసాగుతున్న ఉద్రిక్తత
ర్యాలీ సమయం నిర్ణయించడానికి ప్రతినిధులు పోలీసులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ ట్రాక్టర్ ర్యాలీలతో రైతులు బారికేడ్లను దాటుకుని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించడంతో అటు తిక్రీ సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మరోపక్క మరోపక్క ఘాజీపూర్ బోర్డర్ లోనూ ట్రాక్టర్ పరేడ్ మొదలైంది. గణతంత్ర దినోత్సవ పరేడ్ తరువాత ఢిల్లీ పోలీసులు ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇచ్చారు.
రైతుల కిసాన్ పరేడ్ కు పూలు చల్లి మద్దతు తెలుపుతున్న స్వరూప్ నగర్ వాసులు
రాజ్పథ్లో వేడుకలకు అంతరాయం కలగకుండా ఉండేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకల తరువాత, రైతులు కిసాన్ పరేడ్ ఢిల్లీలో కొనసాగనుంది. అయితే కిసాన్ పరేడ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ నిరసనకారులను కంట్రోల్ చెయ్యటం పోలీసులకు కత్తిమీద సాముగా మారింది.ఇక రైతుల కిసాన్ పరేడ్ కు మద్దతుగా రైతులపై పూలు చల్లి మద్దతును ప్రకటించారు స్వరూప్ నగర్ వద్ద స్థానికులు.
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు .. పరేడ్ పై ఆందోళన
రైతుల కవాతును నిర్వహించడానికి రైతులకు మూడు మార్గాలు క్లియర్ చేశారు అధికారులు . సింగు సరిహద్దు సమీపంలో 63 కిలోమీటర్ల మార్గం, తిక్రీ సరిహద్దు నుండి 62.5 కిలోమీటర్ల పొడవు, ఘాజిపూర్ సరిహద్దు నుండి 68 కిలోమీటర్ల పొడవైన మార్గంలో కిసాన్ పరేడ్ కు అధికారులు మార్గాలను క్లియర్ చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య అనేక గందరగోళ పరిస్థితుల మధ్య రైతుల ట్రాక్టర్స్ ర్యాలీ.. కిసాన్ పరేడ్ పై ఆందోళన కనిపిస్తోంది.