రైతులతోనే దేశం సశ్యస్యామలం..! అందుకే రైతులందరికీ కిసాన్ సమ్మాన్ పథకం..!!
ఢిల్లీ/హైదరాబాద్ : ఎన్నికల ప్రహసనం ముగిసింది. భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీ గా అవతరించింది. మోదీ నేతృత్వంలో మంత్రివర్గం కూడా కొలువు దీరింది. ఇక సంస్కరణల దిశగా మీజేపి అడుగులు వేస్తోంది. ముందుగా దేశానికి వెన్నముక లాంటి రైతన్నలకోసం వినూత్న అడుగులు వేయాబోతోంది మోదీ సర్కార్. అధికార బీజేపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం సాయంత్రం తొలిసారి నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలో ఉన్న అర్హులైన రైతులందరికీ కిసాన్ సమ్మాన్ పథకం కింద ఏటా 6,000 రూపాయల సాయం అందించాలని నిర్ణయించింది. అలాగే చిన్న, సన్నకారు రైతులకు, జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపారులకు పింఛను పథకం అమలు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన ఈ హామీని నెరవేర్చినట్లయింది. పాడి పశువులకు వ్యాధులు ప్రబలకుండా కేంద్రప్రభుత్వ ఖర్చుతోనే వ్యాక్సిన్లు వేయించాలని తీర్మానించింది.
ఇదిలా ఉండగా ఈ నెల 17 నుంచి జులై 26వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని, జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ 2 హెక్టార్ల లోపు ఉన్న రైతులకే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వర్తింపజేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 12.50 కోట్లు. ఇక మీదట రైతులందరికీ వర్తింపజేయడం వల్ల లబ్ధిదారుల సంఖ్య 14.50 కోట్లకు చేరనుంది.
చిన్న, సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3వేల పింఛను అందించడానికి వీలుగా ప్రధానమంత్రి కిసాన్ పింఛన్ యోజన తీసుకొస్తున్నారు. దీని కింద 18 నుంచి 40 ఏళ్లలోపు రైతులు చేరొచ్చు. 17వ లోక్సభ తొలి పార్లమెంటు సమావేశాలు జూన్ 17 నుంచి జులై 26 వరకు 40 రోజులు, 30 సిట్టింగ్ల్లో నిర్వహించాలని నిర్ణయించారు. తొలి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. 19న స్పీకర్ ఎంపిక ఉంటుంది. 20న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత దానిపై చర్చ జరుగుతుంది. జులై 4న ఆర్థిక సర్వే, జులై 5న బడ్జెట్ ఉంటుంది. 26న సమావేశాలు ముగుస్తాయి.