శకటాల పరేడ్ వర్సెస్ ట్రాక్టర్ల నిరసన ప్రదర్శన: గణతంత్ర చరిత్రలో తొలిసారిగా: అసలు నిర్వచనం
న్యూఢిల్లీ: దేశ 72వ గణతంత్ర దినోత్సవం వేళ.. చరిత్రలో ఇప్పటిదాకా చోటు చేసుకోని అపురూప దృశ్యాలు దేశ రాజధానిలో కనిపిస్తున్నాయి. సాధారణంగా గణతంత్ర దినోత్సవం నాడు నిర్వహించే వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల పరేడ్కు ధీటుగా ట్రాక్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది. ఒకవంక శకటాలు, త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పరేడ్కు ధీటుగా- మరోవంక రైతులు తమ విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ట్రాక్టర్లతో నిర్వహిస్తోన్న కిసాన్ ర్యాలీ దేశ రాజధానిలో కొనసాగుతోంది. ఒకేరోజు ఒకే సందర్భంలో చోటు చేసుకున్న ఈ రెండు వేర్వేరు దృశ్యాలు దేశ అసలు సిసలు శక్తి సామార్థ్యాలకు అద్దం పట్టిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ పక్కా స్కెచ్: సొంత కులం ఓటుబ్యాంకుపై ఫోకస్: త్వరలో భేటీ
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా..
కేంద్ర దేశవ్యాప్తంగా అమలు చేయదలిచిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల రైతులు మహోద్యాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రోజుల తరబడి కొనసాగిన వారి దీక్షల ప్రభావంతో కేంద్రం దిగి వచ్చింది. మూడు వ్యవసాయ బిల్లులను అమలు చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. అంతకుముందే- దేశ రాజధానిలో ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం రైతులకు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ఢిల్లీలో ట్రాక్టర్ల ప్రదర్శన కొనసాగుతోంది.
జై జవాన్.. జైకిసాన్..
జై జవాన్.. జై కిసాన్ అనే నినాదానికి అసలు సిసలు నిర్వచనం ఇచ్చినట్టు కనిపిస్తోందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దేశ రక్షణ వ్యవస్థ ఎంత బలమైందో నిరూపించేలా త్రివిధ దళాలకు చెందిన శకటాలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యాయి. అత్యాధునికమైన రాఫెల్ జెట్ ఫైటర్లతో పాటు రుద్ర, సుదర్శన్, రక్షక్, ఏకలవ్య, బ్రహ్మాస్త్ర, గరుడ వంటి హెలికాప్టర్ల ద్వారా దేశ రక్షణ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందనేది స్పష్టం చేస్తున్నాయి. నౌకాదళం తరఫున ఐఎన్ఎస్ విక్రాంత్ శకటాన్ని పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో రైతుల కిసార్ ర్యాలీ కొనసాగుతోండటం ఓ అనూహ్య సన్నివేశానికి వేదికగా నిలిచింది.
ట్రాక్టర్ల ప్రదర్శన ఉద్రిక్తత..
ఇదిలావుండగా.. రైతులు నిర్వహిస్తోన్న కిసాన్ ర్యాలీ కొన్నిచోట్ల ఉద్రిక్తంగా మారింది. రైతులను నియంత్రించడానికి ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఢిల్లీ-గ్రేటర్ నొయిడా సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాజీపూర్ వైపు నుంచి ఢిల్లీకి ప్రవేశించడానికి రైతులు వేలాదిమంది తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడువు కంటే ముందే వారు ఢిల్లీలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. అదుపు చేయడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఫలితంగా అక్కడ కొంత ఆందోళనకర వాతావరణం నెలకొంది.
ఆంక్షలు ఉన్నా..
ర్యాలీ సందర్భంగా రైతులెవరూ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించకూడదనే ఆంక్షలు ఉన్నాయి.. నిర్దేశిత మార్గాల్లోనే ర్యాలీని నిర్వహించాల్సి ఉంటుందని ఆదేశాలను ఢిల్లీ పోలీసులు ఇదివరకే జారీ చేశారు. మూడు మార్గాల్లో మాత్రమే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. టిక్రి వైపు నుంచి ఢిల్లీలో ప్రవేశించే ట్రాక్టర్లు నంగ్లోయ్, నజఫ్గఢ్, వెస్టర్న్ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ మీదుగా బయటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే ఘాజీపూర్ వైపు నుంచి వచ్చే ట్రాక్టర్లు 56 ఫీట్ రోడ్ వరకు వెళ్లి మళ్లీ కుండ్లీ-ఘజియాబాద్, పల్వల్ ఎక్స్ప్రెస్ వే మీదుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది.