కిషన్ రెడ్డి అను నేను.. సెంట్రల్ కేబినెట్లో తెలంగాణకు బెర్త్
ఢిల్లీ : బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో మొదటి అడుగు వేసింది. ప్రధానమంత్రి మోడీగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గంలో బెర్తులు దక్కిన 58 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తెలంగాణ నుంచి అవకాశం దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్ ఆవరణలో కన్నుల పండువగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా ఈశ్వర్ కీ శపథ్ లేతా హు అంటూ ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు హాజరయ్యారు. పలువురు కేంద్ర మాజీ మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు.
మోడీ, అమిత్ షా మార్క్.. బార్మేర్ ఎంపీ కైలాశ్ చౌదరికి మంత్రిగా ఛాన్స్
సెంట్రల్ కేబినెట్ లో తెలంగాణకు బెర్త్ దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిజాయితీ, నిబద్ధత కలగలిపిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడంపై పార్టీశ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ జెండా రెపరెపలాడటంతో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలనే కారణంతో కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి ఇచ్చినట్లు సమాచారం.
श्री @kishanreddybjp और श्री @PRupala ने राज्य मंत्री के रूप में शपथ ली। #ModiSwearinginhttps://t.co/iWDtcoQZCT pic.twitter.com/q3qzqVaYhU
— BJP (@BJP4India) May 30, 2019
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కిషన్ రెడ్డికి మంచి సాన్నిహిత్యముంది. 2002లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేసిన సమయంలో మోడీకి దగ్గరయ్యారు. ఒకానొక సందర్భంలో మోడీ, కిషన్ రెడ్డి ఓకే రూములో బస చేశారు. అలా వారిద్దరి మధ్య మంచి ర్యాపో ఉందంటారు కిషన్ రెడ్డి సన్నిహితులు. మోడీతో ఉన్న చనువు కారణంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కిందనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి కేంద్ర మంత్రి పదవి దక్కడంపై కిషన్ రెడ్డి హ్యాపీగా ఫీలవుతున్నారు. మరింత కష్టపడుతూ ప్రజలకు మెరుగైన సేవలందించేలా తన కర్తవ్యం నెరవేరుస్తానంటున్నారు.