ప్రమాణ స్వీకారంలో తడబడ్డ కిషన్ రెడ్డి.. సరిదిద్దిన రాష్ట్రపతి
ఢిల్లీ : బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు దక్కించుకున్న పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ గా దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్రపతి భవన్ ఆవరణలో కన్నుల పండువగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర మంత్రిగా ఈశ్వర్ కీ శపథ్ లేతా హు అంటూ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి. అయితే రెండు మూడు సార్లు తడబడటంతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సరిదిద్దారు.
మోడీ, అమిత్ షా మార్క్.. బార్మేర్ ఎంపీ కైలాశ్ చౌదరికి మంత్రిగా ఛాన్స్
తెలంగాణ అసెంబ్లీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తడబాటుకు గురవడం చర్చానీయాంశమైంది. 2004లో హిమాయత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కిషన్ రెడ్డి.. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్ విభజనలో అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014లో రెండుసార్లు అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2018, డిసెంబర్ నెలలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతిలో కేవలం వెయ్యి ఓట్లతో ఓడిపోయారు. అనంతరం లోక్సభ ఎన్నికలు రావడంతో సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగి ఎంపీగా విజయం సాధించారు. అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మూడు సార్లు తడబాటుకు లోనవ్వడం కనిపించింది. దాంతో రాష్ట్రపతి సరిదిద్దాల్సి వచ్చింది. అదలావుంటే ఎవరూ కూడా ప్రమాణ స్వీకారం ముగింపులో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కిషన్ రెడ్డి మాత్రం భారత మాతాకీ జై నినాదం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.