మంత్రి కిషన్ రెడ్డికి మొదటి రోజే అక్షింతలా..? హైదరాబాద్ వ్యాఖ్యలపై అమీత్ షా మండిపాటు, ఒవైసీ అసహనం ..
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్న వెంటనే కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాక్యలు చేసారు. మన దేశంలో ఉగ్ర మూలాలు హైదరాబాదులో ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి సమర్థించుకున్నారు. తాను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని అన్నారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయనే విషయాన్నితాను చెప్పానని అన్నారు. ఐతే కిషన్ రెడ్డి వాఖ్యల పట్ల కేంద్ర హోం మంత్రి అమీత్ షా స్పందించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్ గా మారిందన్న కిషన్ రెడ్డి..! అభ్యంతరం వ్యక్తం చేసిన ఒవైసీ..!!
భోపాల్, బెంగళూరు ఇలా ఉగ్ర ఘటనలు ఎక్కడ జరిగినా వాటి మూలాలు హైదరాబాదులో కనిపిస్తున్నాయని... ప్రతి రెండు, మూడు నెలలకు ఎన్ఐఏ, రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. జరుగుతున్న విషయాన్నే తాను చెప్పానని అన్నారు. హైదరాబాద్ టెర్రరిస్ట్ హబ్' అంటూ కేంద్ర శాఖ హోం సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం చీఫ్ మరియు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ కేంద్ర సహాయ మంత్రి నోట ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందనుకోలేదని, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.
నగరం అభివృద్ది చెందడం ఇష్టం లేదా..! బీజేపిని ప్రశ్నించిన ఒవైసీ..!!
"ముస్లింలను చూస్తే చాలు టెర్రరిస్టులంటూ తీసుకెళుతున్నారు. వీళ్లను మార్చలేం!" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. " నేనా సహాయమంత్రిని ఒకటే అడుగుతున్నాను, ఈ ఐదేళ్లలో ఎన్ఐఏ, ఐబీ, రా అధికారులు ఎన్నిసార్లు హైదరాబాద్ ను ఉగ్రవాదుల అడ్డా అని పేర్కొన్నారు? అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత దురదృష్టకరం. హైదరాబాద్ ఎదగడం వీళ్లకు ఇష్టంలేనట్టుంది" అంటూ ట్వీట్ చేశారు. ఓ కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు తగదని ఒవైసీ హితవు పలికారు. అంతకుముందు, కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, బెంగళూరు, భోపాల్ ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉంటున్నాయన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రతి రెండుమూడు నెలలకోసారైనా హైదరాబాదులో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు.
కిషన్ రెడ్డిపై షా ఆగ్రహం..! వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు..!!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ధుమారం రేపాయి . దీని పైన స్పందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని కిషన్ రెడ్డికి అమిత్షా సూచించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరాలు చెప్పారు. మరొక్క సారి ఇలాంటి వ్యాఖ్యల పురావృతమైతే భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని అమీత్ షా కిషన్ రెడ్డికి సూచించి నట్టు తెలుస్తోంది.
పాతబస్తీలో పాకిస్థానీలు..! మరో బాంబ్ పేల్చిన రాజాసింగ్..!!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్తగా పదవీబాధ్యతలు చేపట్టిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతం అని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదని, ఆయన ఉగ్రవాదులపై చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. పాతబస్తీ మినీ పాకిస్థాన్ లా తయారైందని, అక్కడ ఎంతోమంది పాకిస్థానీలు, బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారని రాజాసింగ్ గతంలోనూ ఆరోపించారు. అలాంటివాళ్లందరినీ ఏరిపారేయాలంటే ఎన్సార్సీ ప్రక్రియ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాను ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని, జాతీయ పౌరుల నమోదు కార్యక్రమం (ఎన్సార్సీ) ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాలని కోరుతున్నామని తెలిపారు. అక్కడ ఎవర్నీ అరెస్ట్ చేయడానికి వీల్లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.