తమ్ముళ్లను వాడేస్తున్నారు.. అడవిలో అన్నలపై కిషన్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..!
ఢిల్లీ : నక్సల్స్ సమస్య నుంచి బయటపడేలా కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ విధానంతో పాటు యాక్షన్ ప్లాన్ సిద్దం చేసిందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. దాని ఆధారంగా శాంతిభద్రతలకు ప్రతికూలంగా మారుతున్న నక్సల్ సమస్యను ఎదుర్కొంటామని వెల్లడించారు. మంగళవారం నాడు లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఇలా సమాధానమిచ్చారు.
నక్సల్స్ నిరోధానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. ఆ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో సీఏపీఎఫ్ బెటాలియన్స్ మోహరింపజేస్తున్నామని పేర్కొన్నారు. అడవులను జల్లెడ పట్టేందుకు హెలికాప్టర్లతో పాటు ఇతర సాధనాలను సమకూర్చుతున్నట్లు తెలిపారు. ఆ దిశగా హోం మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.
మూతపడ్డ ఐదు ఎరువుల పరిశ్రమలకు లైన్ క్లియర్.. 37 వేల కోట్లకు పైగా కేటాయించనున్న కేంద్రం
నక్సల్స్ అంశానికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించిన కిషన్ రెడ్డి ఆ మేరకు లోక్సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నక్సల్స్ చిన్నారులను తమ శిబిరాల్లో చేర్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో వారికి మిలిటరీ తరహా శిక్షణ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.
అంతేగాకుండా చిన్నారులను వివిధ పనులకు వాడుకుంటున్నారని వెల్లడించారు. వంట పనులు చేయించుకోవడం మొదలు భద్రతా దళాల కదలికలపై సమాచారం తెప్పించుకునే విధంగా వారిని ఇన్ఫార్మర్లుగా మార్చేస్తున్నారని పేర్కొన్నారు.