మమతా పోలీస్ అధికారి కోసమే ధర్నా చేయడం లేదు, వెనుక చాలా ఉంది: అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. మమతకు విపక్షాలు మద్దతివ్వడంపై కూడా మండిపడ్డారు. కోల్కతా పోలీస్ కమిషనర్ను సీబీఐ ప్రశ్నించేందుకు వెళ్లిన వ్యవహారంపై మమత అతిగా స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
సీబీఐ ఇష్యూ: పవార్ ఇంట్లో విపక్షాల భేటీ, చంద్రబాబును అడిగాక నిర్ణయం... మమతా బెనర్జీ
కేవలం ఒక పోలీసు అధికారి కోసం మమత బెనర్జీ ధర్నా చేపట్టారనుకోవడం పొరపాటు అవుతుందన్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏమిటని నిలదీశారు. ధర్నాకు ఇతర విపక్ష నేతలను ఆహ్వానించడం వెనుక ఉన్న అర్థమేమిటన్నారు. ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలను వెనక్కి నెట్టి... రానున్న ఎన్నికల్లో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడం కోసమే ఆమె ధర్నా చేస్తున్నారని చెప్పారు.
మమత దీక్షకు పలు ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు పలికారని, వీరిలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నవారేనని గుర్తు చేశారు. అవినీతి పాలకులంతా ఏకమై దేశ పగ్గాలను చేపట్టాలని చూస్తున్నారన్నారు. ఎలాంటి సిద్ధాంతాలు లేని ఇలాంటి సంకీర్ణాలు దేశానికి విపత్తును కలిగిస్తాయన్నారు. వారిది అవినీతిపరుల క్లబ్ అన్నారు.