టిప్పు జయంతి వ్యతిరేక ర్యాలీ: వీహెచ్పి నేత హత్య
మడికేరి (కర్ణాటక): కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న టిప్పు సుల్తాన్ జయంతిని బహిష్కరిస్తూ బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. బంద్ లో హింస చెలరేగి వీహెచ్ పీ నేత దారుణ హత్యకు గురైనాడు. కొందరికి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టిప్పు సుల్తాన్ జయంతిని బహిష్కరిస్తూ బీజేపీ, వీహెచ్ పీతో పాటు పలు హిందూ సంఘాలు, సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. కొడగు జిల్లాలో బంద్ కు పూర్తి మద్దతు పలికారు. సోమవారం ఉదయం నుంచి అన్ని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి.
కేఎస్ఆర్ టీసీతో పాటు ప్రయివేటు వాహన సంచారం స్థంభించింది. అదే సమయంలో రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి. పొరుగున ఉన్న కేరళ నుంచి వచ్చిన ఓ వర్గం వారు రెచ్చిపోవడంతో పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ఇదే సమయంలో విశ్వహిందూ పరిషత్ కొడగు జిల్లా ప్రధాన కార్యదర్శి కుట్టప్ప (50) తల మీద బండరాళ్లతో దాడి చెయ్యడంతో తీవ్రగాయాలైనాయి. అతనిని జిల్లా ఆసుపత్రి కి తరలిస్తున్న సమయంలో మరణించారు.
మడికేరిలోని తిమ్మయ్య సర్కిల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐజీపీ సింగ్, కొడగు జిల్లా ఎస్పీ వార్తికా కాటియార్ సంఘటనా స్థలంలో మకాం వేశారు.
మైసూరు, మంగళూరు, తుమకూరు, చిక్కమగళూరు తదితర ప్రాంతాలలో టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించరాదని ధర్నాలు, రాస్తా రాకోలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. కొడుగు జిల్లాలో నిషేదాజ్ఞలు అమలు చేశారు.