PM Cares Fundను ఎవరూ ఎందుకు నమ్మట్లేదు: కెట్టో ద్వారా విరూష్క ఫండ్ రైజింగ్
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనూష్క శర్మ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున నిధుల సమీకరణకు దిగారు. వారం రోజుల పాటు ఈ నిధుల సమీకరణ కొనసాగుతుంది. వారం రోజుల పాటు దేశ, విదేశాల నుంచి వీలైనంత అధికంగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ నిధులను కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల కోసం వినియోగించనున్నారు. దీనితోపాటు వారిద్దరూ స్వయంగా రెండు కోట్ల రూపాయల విరాళంగా ప్రకటించారు.
Recommended Video
ఫండ్స్ రైజింగ్ క్యాంపెయిన్కు..
కెట్టో ఫండ్స్ (Ketto funds)తో కలిసి #InThisTogether విరూష్క దంపతులు ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ను చేపట్టారు. దీనిపై కొద్దిసేపటి కిందటే వారు సోషల్ మీడియా వేదికలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనా వల్ల దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకోవడానికి దేశం నిరంతరాయంగా పోరాడుతోందని అన్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల దేశ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నారని, వాటిని చూస్తోంటే బాధకలుగుతోందని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారికి వైద్య సదుపాయాన్ని కల్పించడానికి డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని చెప్పారు.
ఫ్రంట్లైన్ వర్కర్లకు అండగా..
వారికి ఇప్పుడు అండగా నిల్చోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. అందుకే అనుష్కశర్మతో కలిసి కెట్టో ఫండ్స్ ద్వారా నిధులను సమీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు విరాట్ కోహ్లీ. ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన ద్వారా అందే ప్రతీ రూపాయి ఎంతో విలువైనదని, ఎంతో మంది ప్రాణాలను నిలపడానికి అది ఉపయోగడపడుతుందని చెప్పారు. మన కుటుంబం, స్నేహితుల సంక్షేమం కోసం కలిసి నడుద్దామని, ఉమ్మడిగా కరోనాను జయిద్దామని పేర్కొన్నారు. కెట్టో సంస్థకు వారిద్దరూ కలిసి రెండు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ మేకు కెట్టో ఫండ్స్ టాప్ డోనర్స్ జాబితాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ నిలిచారు.
పీఎం కేర్స్ ఫండ్ను కాదని..
ఈ విరాళం నేపథ్యంలో.. పీఎం కేర్స్ ఫండ్ (PM Cares Fund) మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధీనంలో ఉండే ఫండ్ ఇది. ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) దీన్ని పర్యవేక్షిస్తుంటుంది. విపత్తులు, సంక్షోభాలు ఎదురైనప్పుడు ఇందులో నుంచే నిధులను కేటాయిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం దేశవ్యాప్తంగా పలవురు పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీలన్నీ.. పీఎం కేర్స్ ఫండ్కు నిధులను విరాళంగా ప్రకటిస్తుంటాయి. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఎందుకు నమ్మట్లేదు..
గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్కు విరాళాన్ని ఇచ్చిన విరాట్ కోహ్లీ, అనూష్క శర్మ.. ఈ సారి రూటు మార్చారు. పీఎం కేర్స్ ఫండ్కు కాకుండా కెట్టో ఫండ్స్కు విరాళాన్ని ఇచ్చారు. పైగా-వారం రోజుల క్యాంపెయిన్ను కూడా ఆ సంస్థ ద్వారానే చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. పీఎం కేర్స్ ఫండ్ విశ్వాసాన్ని కోల్పోయిందంటూ విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న భారత్కు ఇదివరకు కెనడా, ఇతర దేశాలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించినప్పటికీ.. అవి నేరుగా పీఎం కేర్స్ ఫండ్కు ఇవ్వలేదు. రెడ్ క్రాస్ సొసైటీ, యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలను ఆధారంగా చేసుకున్నాయి. ఇదివరకు విరాళాన్ని ప్రకటించిన క్రికెటర్లు కూడా పీఎం కేర్స్ ఫండ్ను కాదని, అంతర్జాతీయ వేదికల ద్వారా భారత్కు సహాయాన్ని ప్రకటించారు.