ఆ పెళ్లేమిటి: కోహ్లీపై బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
భోపాల్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బిజెపి శాసనసభ్యుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ జాతి వ్యతిరేకి అని ఆయన వ్యాఖ్యానించారు.
విరాట్ కోహ్లీకి దేశభక్తి లేదని అన్నారు. ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీకి దేశభక్తి లేదని మధ్యప్రదేశ్ బిజెపి ఎమ్మెల్యే పన్నా లాల్ శాక్య అన్నారు. దేశంలో కీర్తిని, డబ్బును సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇటలీలో వివాహం చేసుకున్నారని ఆయన అన్నారు.
రాముడు, కృష్ణుడు ఇక్కడే
భగవాన్ రాముడు ఈ భూమిలోనే వివాహం చేసుకున్నాడని, భగవాన్ కృష్ణుడు కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని, విరాట్ కోహ్లీ మాత్రం వివాహం చేసుకోవడానికి ఇటలీ వెళ్లాడని ఆయన అన్నారు. విరాట్ కోహ్లీ దేశభక్తుడు కాడని అన్నారు.
కోహ్లీ స్ఫూర్తిప్రదాత కాలేడు
భారతీయులకు విరాట్ కోహ్లీ స్ఫూర్తిప్రదాత కాలేడని ఆయన అన్నారు. దేశ విధేయులకు మాత్రమే స్ఫూర్తినిచ్చే అర్హత ఉంటుందని అన్నారు. అనుష్క శర్మపై కూడా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేసారు. గుణలో ప్రధాని నరేంద్ర మోడీ స్కిల్ ఇండియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
వారలా అయ్యారు. కానీ...
ఇటలీ డ్యాన్సర్స్ బారతదేశంలో కోటీశ్వరులయ్యారని ఆయన అన్నారు. కోహ్లీ మాత్రం దేశ సంపదను ఇతర దేశాలకు తీసుకెళ్లాడని ఆయన అన్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే సాక్య విరాట్ కోహ్లీపై ఆ విధమైన వ్యాఖ్యలు చేశారని కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
అది స్పష్టమైంది కాబట్టే...
గుజరాత్ సందేశం స్పష్టంగా ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెసు అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది అన్నారు. జాతీయత భావాన్ని రెచ్చగొడితే తప్ప మనుగడ లేదని బిజెపి భావిస్తోందని, గుజరాత్లో బిజెపి సుప్రీం నేత మాజీ ఆర్మీ చీఫ్, మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతి సమగ్రతను సమాజాన్ని విభజించి ఓట్లు పొందడానికి ప్రశ్నించారని ఆయన నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు.