భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!
బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కర్ణాటకలోని కోలారుకు చెందిన శంకర్ (41) భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన కేసులో శంకర్ కు న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విదించింది. అనారోగ్యంతో ఉన్న శంకర్ ను విక్టోరి ఆసుపత్రిలోని జైలు వార్డుకు తీసుకు వచ్చారు.
విక్టోరియా ఆసుపత్రి జైలు వార్డులో చికిత్స పొందుతున్న శంకర్ ఫిబ్రవరి 16వ తేదీ జైలు సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అనంతరం శంకర్ తన ప్రియురాలు రేణుకతో కలిసి మెజస్టిక్ సమీపంలోని సూర్య నెస్ట్ లాడ్జ్ కు వెళ్లాడు.
తాము దంపతులు అని, గది అద్దెకు ఇవ్వాలని లాడ్జ్ సిబ్బందికి మనవి చేసిన శంకర్ ఒక గది తీసుకున్నాడు. రెండు రోజులు అయినా గది నుంచి శంకర్, రేణుక బయటకు రాలేదు. అయితే ప్రియురాలు రేణుకను హత్య చేసిన శంకర్ అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. గదిలో నుంచి దుర్వాసన రావడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి గది తాళాలు పగలుగొట్టి చూడగా రేణుక హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి శంకర్ కోసం గాలిస్తున్నామని, త్వరలో అతన్ని పట్టుకుంటామని డీసీపీ చెన్నబసవన్నవర్ అన్నారు.