ఎస్సై సస్పెండ్, మిగతావారికి నోటీసులు .. మిస్ ఇండియా యూనివర్స్ కంప్లైంట్పై స్పందించకపోవడంతో చర్యలు
కోల్కతా : మాజీ మిస్ ఇండియా యూనివర్స్ను ఆకతాయిలు అల్లరి చేసిన ఘటనలో స్పందించని పోలీసులపై వేటు పడింది. చారు మార్కెట్ పోలీసుస్టేషన్ ఎస్సై్ పీయూష్ కుమార్ను సస్పెండ్ చేస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మిగతా సిబ్బందికి షోకాజు నోటీసులు కూడా జారీచేశామని పేర్కొన్నారు. రాత్రివేళ పోకిరీలు అల్లరి చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఇప్పటికే అల్లరిమూకలను అరెస్ట్ చేశారు. స్పందించని పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు.
షోకాజు నోటీసులు ..
మైదాన్ పోలీసుస్టేషన్ ఏఎస్సై పార్థ ఛటర్జీ, భవనీపూర్ పీఎస్ ఎస్పై మీనన్ మజుందార్లకు కూడా షోకాజు నోటీసులు జారీచేసినట్టు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం వహించినందుకు ఎస్పైపై చర్యలు తీసుకున్నట్టు వివరించారు. మిగతా పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చామని .. వారి వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
ఇదీ విషయం ..
సోమవారం రాత్రి 11.40 గంటలకు జేడ్యూ మారయిట్ హోటల్లో తమ విధులు ముగించుకొని బయటకొచ్చారు మాజీ మిస్ ఇండియా యూనివర్స్ శెన్ గుప్తా. ఈ మేరకు తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆమె మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో పనిచేస్తున్నారు. అయితే రాత్రిళ్లు కూడా విధులు చేయాల్సి రావడంతో పని పూర్తయ్యాక బయటకొచ్చారు. తనతోపాటు కొలిగ్ కూడా ఉన్నారు. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికెళ్తున్నారు. ఇంతలో కొందరు ఆకతాయిలు బైక్ల మీద వచ్చారు. వారికి హెల్మెట్ కూడా లేదని తెలిపారు. తమ వాహనం నిలిపివేసి .. డ్రైవర్పై తిట్ల దండకం ప్రారంభించారని తెలిపారు. అంతేకాదు కారును కదుపుతూ .. డ్రైవర్ను బయటకు లాగారని పేర్కొన్నారు. డ్రైవర్ చెప్పేది కూడా వినకుండా దాదాపు 15 మంది కలిసి దాడిచేశారని వివరించారు.
ధైర్యం చేసినా ..?
తాను ధైర్యం చేసి కారు డోర్ తీసి బయటకొచ్చానని .. వీడియో తీయడం ప్రారంభించానని తెలిపారు. వెంటనే ప్రాథమిక సాక్ష్యంగా వీడియోను చూపించి చారు పోలీసు స్టేషన్ వద్దకు పరుగెత్తితే అది మా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాదని చెప్పారని నిట్టూర్చారు. అక్కడ డ్రైవర్ను చావ కొడుతున్నారని చెపితే పోలీసులు వచ్చారని ... వారిని చూసి అల్లరిమూకలు పారిపోయారని తెలిపారు. అక్కడినుంచి వెళ్లాక కూడా ఆ అల్లరిమూకలు తమను ఫాలో అయ్యారని పేర్కొన్నారు. తర్వాత కూడా కారును ఆపే యత్నం చేశారని ఆపకపోవడంతో రాళ్లతో దాడిచేశారని గుర్తుచేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.