కశ్మీర్పై రాజ్యసభలో ఓటింగ్... ఆ టైంలో ఎంపీలను గాల్లో తిప్పిన ఎయిరిండియా
న్యూఢిల్లీ: కోల్కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం అమృత్సర్కు దారి మళ్లించారు. ఢిల్లీ విమానాశ్రయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉన్నందున ముందుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు అధికారుల నుంచి అనుమతి రాలేదు. దీంతో అక్కడక్కడే చక్కర్లు కొట్టిన విమానం... ఆ తర్వాత ఇంధనం అయిపోయే స్థితికి వస్తోందని అధికారులకు పైలట్ సమాచారం చేరవేయడంతో చేసేదేమీ లేక విమానంను అమృత్సర్కు దారి మళ్లించారు. ఆ సమయంలో విమానంలో ఐదు మంది ఎంపీలు ఉన్నట్లు సమచారం. వీరంతా జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న నేపథ్యంలో హాజరయ్యేందుకు వస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎయిరిండియా విమానంను ఎందుకు అమృత్సర్కు దారి మళ్లించారనేదానిపై పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై సివిల్ ఏవియేషన్ అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అంతేకాదు విమానంలో చిక్కుకుపోయిన ఆ ఐదుగురు ఎంపీల వివరాలు కూడా బయటపెట్టలేదు అధికారులు. సభలో జమ్ము కశ్మీర్ విభజన బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీఎంసీ ఎంపీలు సభలో లేరని వారు వచ్చాక ఓటింగ్ నిర్వహించాలంటూ ఇందుకోసం మరో అరగంట సమయం ఇవ్వాలని ఛైర్మెన్ వెంకయ్యనాయుడుని టీఎంసీ ఎంపీ కోరారు. ఇందుకు అంగీకరించారు వెంకయ్య నాయుడు. అయితే అరగంట సమయం దాటిపోయినప్పటికీ టీఎంసీ ఎంపీలు సభకు హాజరుకాకపోవడంతో వెంకయ్యనాయుడు ఓటింగ్కు వెళ్లేందుకు నిర్ణయించారు. దీంతో సభనుంచి ఉన్న ఒక్క టీఎంసీ ఎంపీ కూడా వాకౌట్ చేశారు. విమానంలో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ముగ్గురు లోక్సభ ఎంపీలు ఉన్నట్లు సమాచారం.
Air India Kolkata-Delhi flight (AI-021) was diverted to Amritsar due to traffic and low holding fuel, as advised by Air Traffic Control (ATC).Five MPs from Bengal (three Lok Sabha MPs and two Rajya Sabha MPs) are on-board; they were coming to attend Parliament today. pic.twitter.com/VrEZvGUwR0
— ANI (@ANI) August 5, 2019
ఇదిలా ఉంటే జమ్మూ కశ్మీర్లో పునర్విభజన బిల్లులో తొలి ఘట్టం ముగిసింది. రాజ్యసభలో ఉదయం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ తీర్మానం ప్రతిపాదిచారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దీనిపై మెజార్టీ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. అనంతరం అసెంబ్లీతో కూడిన జమ్ము కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ అదే సమయంలో లడఖ్ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కశ్మీర్ పునర్విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బిల్లుపై చర్చ ముగిసిన తర్వాత రాజ్యసభ ఛైర్మెన్ ఓటింగ్కు అనుమతించారు. అయితే ముందుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా నిర్వహించాలని భావించినప్పటికీ... సాంకేతిక సమస్య తలెత్తడంతో స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేయగా... వ్యతిరేకంగా 61 మంది సభ్యులు ఓటువేశారు. దీంతో కశ్మీర్ పునర్విభజన బిల్లు పాస్ అయినట్లుగా రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు హౌజ్లో ప్రకటించారు.