చనిపోయిన వృద్ధురాలు.. కుళ్లిన శవం పక్కనే కుటుంబసభ్యులు.. దుర్వాసన భరించలేక..
కోల్కతా : బెంగాల్ సౌత్ కోల్కతాలోని రఖాల్ చట్టర్జీ స్ట్రీట్. ఓ నాలుగంతస్థుల అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. రెండు రోజుల పాటు దాన్ని భరించిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లాట్ తెరిచి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు.
భార్యను కిడ్నాప్ చేశారని స్టేషన్కు వెళ్లిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే..?
ఇంట్లో అడుగుపెట్టిన పోలీసులకు హాల్లో 80 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలి శవం కనిపించింది. పక్కనే ఆమె భర్త, కూతురు కూర్చొని ఉన్నారు. భరించలేని దుర్వాసన వస్తున్నా వారు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వృద్ధురాలు చనిపోయి మూడు నాలుగు రోజులైనా వారు తమ సంబంధీకులెవరికీ సమాచారం ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఇంటి తలుపులు, కిటికీలు మూసివేయడంతో పాటు కనీసం ఆహార పదార్థాలు తెచ్చుకునేందుకు కూడా బయట అడుగుపెట్టలేదని గుర్తించారు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఆరు నెలల క్రితం అదే ఇంట్లో ఇలాంటి ఘటనే జరిగింది. వృద్ధురాలి కొడుకు దేబాశీశ్ ఛటర్జీ మృతిచెందాడు. అప్పట్లో కూడా కుటుంబసభ్యులు ఆయన చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వలేదు. అప్పట్లో కూడా మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇలాంటి ఘటనలు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆ కుటుంబంలోని వారెవరూ చుట్టుపక్కల వారితో మాట్లాడరని, దేబాశీశ్ చనిపోయిన నాటి నుంచి అందరితో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెప్పారు. మృతి చెందిన వారి గురించి ఎవరికీ చెప్పకపోవడంతో కుటుంబసభ్యుల మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.