నటి శిల్పాశెట్టిపై కేసు నమోదు, మోసం చేసిందంటూ కోల్కత్తా సంస్ధ ఫిర్యాదు
కోల్కత్తా: బాలీవుడ్ నటి శిల్పాశెట్టిపై కోల్కత్తా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందింది. తమను రూ. 9 కోట్లకు బాలీవుడ్ నటి, వ్యాపార వేత్త శిల్పాశెట్టి మోసం చేసిందంటూ కోల్కత్తాకు చెందిన ఓ ప్రైవేట్ సంస్ధ ఆరోపణలు చేసింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శిల్పా అండ్ రిపు సుదన్ కుంద్రా ఆఫ్ ఎస్సెన్షీయల్ స్టోర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని శిల్పా నడుపుతోంది. ఈ సంస్ధలో తాము పెట్టుబడులు పెట్టి మోసపోయామని ఎంకే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ అదనపు డైరెక్టర్ దేబసిస్ గుహ కేసు పెట్టారు.
దీంతో పోలీసులు శిల్పా, ఆమె సంస్ధపై నమ్మక ద్రోహం, మోసం, ఉద్దేశపూర్వక కుట్రతదితరమైనవి పేర్కొంటూ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శిల్పాశెట్టి నడుపుతున్న కంపెనీలో రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టామని, తిరిగి వాటిని చెల్లించకుండా ఆమె మోసం చేసిందని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతే కాకుండా, రెండేళ్లలో పదింతలు తిరిగిస్తామని పెట్టుబడులు పెట్టించి అనంతరం పట్టించుకోవడం మానేశారని, మోసం చేశారని సదరు సంస్ధ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ. 9 కోట్ల పెట్టుబడుల్లో భాగంగా శిల్పాశెట్టి కంపెనీ కేటాయించిన రూ. 30 లక్షల ఈక్వీటీ షేర్లు బోగస్ అని తేలినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.