డాక్టర్లతో సమ్మె విరమింపజేయండి: మమతకు కోల్కతా హైకోర్టు సూచన
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్లో డాక్టర్ల సమ్మె ఉదృతం అవుతుండటంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నం చేయాలంటూ ఇటు కేంద్రప్రభుత్వంతో పాటు పలువురు ప్రముఖులు కూడా మమత సర్కార్కు విజ్ఞప్తి చేశారు. అయితే మమతా మాత్రం ఇంకా మొండి వీడలేదు. ఓ వైపు రోగులు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణకు మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే కోల్కతా హైకోర్టు మమత సర్కార్ వెంటనే చర్యలు తీసుకుని డాక్టర్లతో చర్చించి సమ్మెవిరమింప జేయాలని సూచించింది.
డాక్టర్ల సమ్మెపై విచారణ చేసిన చీఫ్జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం మమతా సర్కార్ వెంటనే డాక్టర్లతో చర్చలు జరిపి వారు సమ్మెను విరమించేలా చూడాలని సూచించింది.తిరిగి విధుల్లో చేరి సేవలు అందిచేలా చూడాలని కోర్టు ఆదేశించింది. బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన వైద్యసేవలతో చాలా మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమ్మెను విరమింపజేయాలని వచ్చిన విజ్ఞప్తిని స్వయంగా విచారణ చేశారు చీఫ్ జస్టిస్. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు. ఇక జూనియర్ డాక్టర్పై సిటీ ఆస్పత్రిలో దాడి జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇటు రాష్ట్రంలో అటు దేశంలో వైద్యసేవలు నిలిచిపోయినందుకు కారణం సీఎం మమతా బెనర్జీ మొండిగా ప్రవర్తించడమే అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక డాక్టర్లు తమకు భద్రత కల్పించాలని మాత్రమే కోరుతున్నారని అది కూడా మమతా చేయకుంటే ఎలా అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రశ్నించారు. భద్రత కల్పించాల్సిందిపోయి వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అల్టిమేటం జారీ చేయడంవల్లే ఈ రోజు దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మెకు దిగారని మండిపడ్డారు.
]ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి మృతి చెందడంతో మృతుని బంధువులు ఓ డాక్టరును చితకబాదడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి వైద్యసేవలు నిలిపివేసి సమ్మెలో దిగారు. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా వైద్యులు సేవలు నిలిపివేసి సమ్మెలో పాల్గొంటున్నారు. ఇక జూన్ 17వ తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్.