మదర్సాలో జాతీయగీతం పాడమన్నందుకు దాడి
కోల్కతా: నగరంలోని తల్పుకూర్ ఆరా ఉన్నత మదర్సాలో ఖాజీ మసూమ్ అక్తర్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు ఆయన సూచించాడు. అంతే, ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
కాగా, దాడికి పాల్పడిన మౌలానాలకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర కూడా ఉంది. ఇది ఇలా ఉండగా, తనపై దాడి గురించి అక్తర్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు.
ఇప్పటికే మౌలానాలు అక్తర్కు వ్యతిరేకంగా ఫత్వా కూడా జారీ చేశారు. అంతేగాక, జాతీయగీతం దైవ దూషణేనని, అది హిందుత్వ గీతమని వారు ఆరోపించారు.
అక్తర్పై ఇనుపరాడ్లతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అక్తర్ను మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీ చేశారు మౌలానాలు.
ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమచారం అందించాలని ఆదేశించారు.
కాగా, ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అక్తర్కు భద్రత కల్పించలేమంటూ కోల్కతా పోలీస్ కమిషనర్.. మైనారిటీ కమిషన్ ఛైర్మన్కు లేఖ రాయడం గమనార్హం. దాడి జరిగిన నాటి నుంచి తాను మదర్సాకు వెళ్లలేదని, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అక్తర్ కోరారు.
అక్తర్.. గత కొంతకాలంగా ముస్లిం బాలికల విద్యను ప్రోత్సహించడంతోపాటు ముస్లింలలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. అంతేగాక, ముస్లింలు బాలికలను వృద్ధులైన ముస్లింలకు ఇచ్చి వివాహం చేయడం సరికాదని ప్రచారం చేస్తున్నారు.