నిర్లక్ష్యమా, ప్రమాదమా.. మెట్రో రైలు డోర్ నిండు ప్రాణం మింగేసింది..!
కోల్కతా : నిర్లక్ష్యమో, ప్రమాదమో ఏమో గానీ ఓ నిండు ప్రాణం మాత్రం బలైంది. మెట్రో రైలు డోర్ నిండు మనిషి ప్రాణాలు మింగేసింది. ఆ ఘటనతో స్థానిక పార్క్ స్ట్రీట్ మెట్రో రైల్వే స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది.
శనివారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాల సమయం. ప్రయాణీకులతో పార్క్ స్ట్రీట్ మెట్రో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఆ క్రమంలో 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ సజల్ కుమార్ కాంజీవాల్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే సదరు రైలులో వీపరీతమైన రద్దీ ఉంది. సజల్ కుమార్ రైలు ఎక్కే క్రమంలో ఆయన చేయి డోర్లో ఇరుక్కుంది. అతడు మాత్రం బయటే ఉండిపోయాడు.
ప్రేమికుడి మోసం బెడిసికొట్టింది.. ఆసుపత్రిలో ప్రేమ పెళ్లి..!
మెట్రో రైళ్లల్లో సెన్సార్ డోర్లు ఉపయోగించడంతో ఆయనను అలాగే ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లింది సదరు ట్రైన్. కొద్దిదూరం వెళ్లిన తర్వాత విషయం తెలిసి టెక్నికల్ సిబ్బంది ఎమర్జెన్సీ బ్రేకులు వేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పట్టాలపై పడిపోయిన సజల్ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు.
ఈ ప్రమాదం వెనుక ఒక అనుమానం బలపడుతోంది. మెట్రో డోర్ సెన్సార్లు పనిచేయకపోవడం వల్లే సజల్ కుమార్ మృత్యువాత పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై అత్యున్నత స్థాయి విచారణ జరిపించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదలావుంటే సదరు ప్రయాణీకుడిని గమనించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఇద్దరు టెక్నికల్ సిబ్బందిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.