విహారయాత్రకు వెళ్లిన.. విద్యార్థినిపై టాక్సీ డ్రైవర్ రేప్
కోల్కతా: ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు పరీక్షలు ముగియడంతో సిక్కిం పర్యటనకు వెళ్లారు. వారు అద్దెకు తీసుకున్న డ్రైవరే వారిలో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే13న కోల్కతాకు చెందిన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు విహారయాత్రకు సిక్కిం వెళ్లారు. గ్యాంగ్టక్లో బంధువుల హోటల్లో బస చేసిన వారు.. సమీపంలోని ప్రదేశాలను చూసేందుకు ఓ టాక్సీని మాట్లాడుకున్నారు.
కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత డ్రైవర్ వారికి చిప్స్, నీళ్లు అందించాడు. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తీసుకోగా.. వెనక సీట్లో కూర్చున్న మరో ఇద్దరమ్మాయిలు తీసుకోలేదు. చిప్స్ తిన్న తర్వాత ఆ అమ్మాయికి మత్తురావడంతో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.
ఈ విషయాన్ని గమనించిన మరో ఇద్దరమ్మాయిలు అతడ్ని నిలదీశారు. దీంతో డ్రైవర్ వారిద్దరినీ కారులోంచి తోసివేసి, మత్తులో ఉన్న అమ్మాయిని తీసుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరం వరకు నడిచిన ఆ అమ్మాయిలు గ్రామస్తులకు విషయాన్ని చెప్పారు.
విద్యార్థినులు బస చేసిన హోటల్ యాజమానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానికుల సాయంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలిని కాపాడారు. విద్యార్థిని ముఖం, మెడపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.