ఓ మహిళ నిర్వాకం: కూతురి శవం పక్కనే నిద్ర
కోల్కత్తా: కూతురి శవం పక్కనే ఓ మహిళ నిద్రించిన ఘటన హౌరా పట్టణంలోని దోమ్జుర్ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 67 ఏళ్ల అన్నపూర్ణ అనే మహిళకు 24 ఏళ్ల తనిమా అనే కూతురు ఉంది.
అన్నపూర్ణ ప్రైమరీ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. మూర్ఛరోగి అయిన తనిమా మృతి చెందిడంతో ఆ శవాన్ని బెడ్పై అలాగే వదిలేసింది. శవం నుంచి దుర్వాసన రావడంతో ఇళ్ల చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇంటికి సమీపంలోనే నివసిస్తున్న తన కుమారుడికి కూడా సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తలుపుని పగులకొట్టి లొపలికి ప్రవేశించారు. కూతురు శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని తల్లి అన్నపూర్ణ ఒంటరిగా నేలపై పడుకున్నారు. వెంటనే ఆమెను లేపి తనిమా గురించి విచారించారు.
వయోభారం కారణంగా అన్నపూర్ణ తన కూతురు ఎలా చనిపోయిందో తనకు తెలియదని చెప్పడంతో తనిమా మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలస్తాయని హౌరా ఎస్పీ సుకేశ్ కుమార్ జైన్ వెల్లడించారు.
తనిమా మృతదేహం కుళ్లిపోలేదని, కాబట్టి మృతి చెందిన 24 గంటలే అయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. అంటే దీని అర్ధం ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం చనిపోయి ఉండవచ్చని వెల్లడించారు. పోలీసులు మాత్రం తనకున్న మూర్ఛ రోగం వల్లనే తనిమా చనిపోయి ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.