మహారాష్ట్ర బంద్ ఉపసంహరణ: ముంబైలో తేట పడుతున్న స్థితి
Recommended Video
ముంబై:మహారాష్ట్ర బంద్ పిలుపుని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ఉపసంహరించుకున్నారు. బెస్ట్ బస్సులపై జరిగిన దాడిలో నలుగురు డ్రైవర్లు గాయపడ్డారు. దాదాపు 150 మందిని కస్టడీకిలోకి తీసుకున్నారు. దాదాపు 45 బెస్ట్ బస్సులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
గ్రౌండ్ స్టాఫ్ తక్కువగా ఉండడంతో విమానాలు 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయి. పన్వాల్, వాసి మధ్య రైళ్లరాకపోకల పునరుద్ధరణ జరిగింది. వొర్లి మేలా జంక్షన్లో ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
ముంబైలోని హజీ అలి వద్ద ట్రాఫిక్ను మహాలక్ష్మి మార్గ్ గుండా మళ్లించారు. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే సమీపంలో అన్ని చోట్లా ట్రాఫిక్ను పునరద్ధరించారు.
కోరేగావ్ - భీమా సంఘటనలకు నిరసనగా బుధవారం తలపెట్టిన బంద్ కారణంగా ముంబైలో సాధారణ జీవితం స్తంభించింది. నిరసనలు ఢిల్లీకి కూడా పాకాయి. ముంబై బాంద్రాకు వెళ్లే రెండు రహదార్లలో ఆందోళనకారులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
థానేలోని లాల్ బహదూర్ శాస్త్రి రోడ్డులో ఆందోళనకారులు బస్సులను, ఆటో రిక్షాలను అడ్డుకున్నారు. థానేలో బస్సుల టైర్లలో గాలి తీసేశారు. డిల్లీలోని మహారాష్ట్ర సదన్ వద్ద ఆందోళనకారులు నిరసన ప్రదర్శన జరిపారు.
కోరేగావ్ - భీమా సంఘటనకు నిరసనగా దళిత సంఘాలు, నేతలు ఇచ్చిన పిలుపు మేరకు తలపెట్టిన మహారాష్ట్ర బంద్లో బుధవారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోరేగావ్ - భీమా సంఘటనలకు నిరసనగా బంద్ తలపెట్టిన విషయం తెలిసిందే.
ముంబై సెంట్రల్ రైల్వే, హార్బర్ లైన్లపై బంద్ ప్రభావం పడింది. కల్యాణ్, పాన్వేల్లకు నడిచే రైళ్లపై తీవ్రమైన ప్రభావం పడింది. బుధవారం ఉదయం 11 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడా సరిగా నడవడం లేదు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు నిలిచిపోయారు.