లోక్సభ కొత్త స్పీకర్గా కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నిక...ఇదే ఆయన బయోగ్రఫీ..!
ఢిల్లీ:సార్వత్రిక ఎన్నికల తర్వాత అఖండ విజయం సాధించింది బీజేపీ. ఇక నరేంద్ర మోడీ రెండో సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా 17వ లోక్సభ సమావేశాలు జరిగాయి. తొలిరోజున 320 మంది ఎంపీలు లోక్సభలో ప్రమాణస్వీకారం చేశారు. ఇంకా మిగతా సభ్యుల ప్రమాణస్వీకారం మరో రెండురోజుల్లో పూర్తి అవుతుంది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు, కేంద్రబడ్జెట్ ఈసారి సమావేశాల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇక జూన్ 19న స్పీకర్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే స్పీకర్ ఎవరుంటారనేదానిపై స్పష్టత వచ్చింది.
లోక్సభ కొత్త స్పీకర్గా ఓంబిర్లా
ఇక లోక్సభ స్పీకర్గా రాజస్థాన్ రాష్ట్రం కోట లోక్సభ నియోజకర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా 17వ లోక్సభకు స్పీకర్గా వ్యవహరిస్తారు. సుమిత్రా మహాజన్ తర్వాత ఈ పదవిని ఓం బిర్లా చేపట్టనున్నారు. ఓం బిర్లా 1962 నవంబర్ 23న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీకృష్ణ బిర్లా, శంకుతలాదేవి. కామర్స్లో మాస్టర్ డిగ్రీని కోటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పూర్తి చేశారు. అంతేకాదు ఆపై చదువులు అజ్మీర్లోని మహర్షి దయానంద సరస్వతి యూనివర్శిటీ నుంచి పూర్తి చేశారు.
విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర
ఇక ఓం బిర్లా రాజకీయ ప్రయాణం విద్యార్థి దశలోనే ప్రారంభమైంది. విద్యార్థి నాయకుడిగా ఆయన అంచలంచెలుగా ఎదిగారు. 1979లో స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఇక 1991 నుంచి దాదాపు 12 ఏళ్లు పాటు భారతీయ జనతా యువ మోర్చా నాయకుడిగా పనిచేశారు.జాతీయ స్థాయిలో ఆయన భారతీయ జనతా యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఇక 2003లో తొలిసారిగా దక్షిణ కోటా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్కు చెందిన శాంతి ధారివాల్పై 10,101 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక ఆ తర్వాత 2008లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 24,300 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక ఎంపీగా విజయం సాధించకముందు కాంగ్రెస్కు చెందిన పంకజ్ మెహతాపై 50వేల ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి మూడవసారి ఎన్నికయ్యారు. 2003-2008లో రాజస్థాన్ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు.
మూడు సార్లు ఎమ్మెల్యే...రెండు సార్లు ఎంపీగా ఓం బిర్లా
16వ లోక్సభ ఎన్నికల్లో ఓంబిర్లా తొలిసారిగా ఎంపీగా పోటీచేశారు. కోటా-బండి నియోజకవర్గం నుంచి ఆయన పోటీచేసి విజయం దక్కించుకున్నారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఇజ్యరాజ్సింగ్ పై 2లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. 2014లో ఆ సమయంలో బీజేపీ రాజస్థాన్లోని మొత్తం 25 సీట్లను గెలుచుకుంది. తాజాగా 2019 ఎన్నికల్లో కూడా ఆయన ఘన విజయం సాధించి రెండోసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఇక ఒక రాజకీయనాయకుడిగానే కాకుండా ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. సమాజంలోని బడుగు బలహీనవర్గాల వారికి బట్టలు, చదువుకునేందుకు పుస్తకాలు ఉచితంగా సరఫరా చేశారు .అదే సమయంలో పలు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. పేదలకు ఉచితంగా మందులు, భోజనం లాంటివి పెట్టారు. 1991లో ఓంబిర్లా డాక్టర్ అమితా బిర్లాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒకరి పేరు ఆకాంక్ష, మరొకరి పేరు అంజలి. ఆకాంక్ష సీఏ చదవగా.. రెండో కూతురు అంజలి పొలిటికల్ సైన్స్ చదువుతోంది.