కోట్ఖాయ్ స్కూల్ విద్యార్ధిని రేప్: నిందితుడి అరెస్ట్, సీబీఐ ప్లాన్ సక్సెస్
సిమ్లా: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బల్సాంగ్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు. టెక్నాలజీ ఆధారంగా సీబీఐ అధికారులు నిందితుడిని గుర్తించారు. విచారణాధికారులకు చిక్కకుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకొన్నాడు. కానీ, ఎట్టకేలకు సీబీఐ అధికారులు గుర్తించారు.
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని బల్సాంగ్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్ధినిపై మొహ్సు గ్రామానికి చెందిన గత ఏడాది జూలై 4వ తేదిన అదృశ్యమైంది. స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఆమె తప్పిపోయింది.
కానీ, జూలై 6వ తేదిన దట్టమైన అడవి ప్రాంతంలో బాధితురాలి మృతదేహం లభించింది. మృతురాలి శరీరంపై దుస్తులు లేకుండా మృతదేహం దొరికింది. అత్యాచారానికి పాల్పడి నిందితులు ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐకు అప్పగించారు. 9 మాసాల పాటు ఈ కేసును సీబీఐ అధికారులు పరిశోధించారు.
సీబీఐ అధికారుల విచారణ
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో జులై 22న సీబీఐ దర్యాప్తు బాధ్యతలను చేపట్టింది. అప్పటి నుంచి 40 మంది సీబీఐ అధికారులు నేరం జరిగిన చోటుకు చుట్టుపక్కల ప్రాంతంలోనే తొమ్మిది నెలల పాటు మకాం వేశారు. అత్యంత రహస్యంగా స్థానిక ప్రజల నుంచి నిఘా సమాచారం సేకరించుకున్నారు. నేర చరిత్ర ఉన్న వారి వివరాలు తవ్వి తీశారు. సీబీఐ డైరెక్టర్ మొదటి రోజునుంచే దర్యాప్తును పర్యవేక్షించారు.
వెయ్యి మంది విచారణ
ఈ కేసు విచారణలో హిమాచల్ రాష్ట్రానికి చెందిన పోలీసులు తొలుత ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. కాల్డేటాను విశ్లేషించారు. నార్కో విశ్లేషణ, పాలిగ్రాఫ్ పరీక్షలు, నేరం జరిగినప్పుడు తాము అక్కడలేమని అనుమానితులు చెప్పిన విషయం నిర్ధారణ కావడం వంటి ఆధారాలతో నేరంలో వారి ప్రమేయం లేదని సీబీఐ అధికారులు తేల్చారు. దీంతో ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికొచ్చింది. దీంతో సీబీఐ అధికారులు సుమారు వెయ్యి మందిని రహస్యంగా విచారించారు. వారిలో 400 మంది నుండి సమాచారాన్ని సేకరించారు. వీరి నుండి హిస్టరీషీట్లు, ప్రజల డీఎన్ఏ నమూనాలను కూడ సేకరించారు.
ఉపయోగపడిన అత్యాధునిక పరీక్షలు
టెక్నాలజీని ఉపయోగించుకొని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నిపుణులు పర్సంటేజ్ మ్యాచ్, లీనియేజ్ మ్యాచ్ వంటి అధునాతన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలు సీబీఐ అధికారులకు ఉపయోగపడ్డాయి. సీబీఐ ఇలాంటి 250 నమూనాలను సేకరించింది. ఒక నమూనాలో కొంత శాతం నేరం జరిగిన చోట దొరికిన మద్యం సీసాపై బాధితురాలి మృతదేహం దుస్తులపై ఉన్న రక్తం నమూనాతో సరిపోలింది. ఈ నమూనా ఆధారంగా ఒక వ్యక్తిని ప్రశ్నించారు.ఆ అనుమానితుడికి నేరచరిత్ర ఉన్నట్టు గుర్తించారు.
అనుమానితుడే బాలికను హత్య చేశాడు
కాంగ్రా జిల్లాలోని అనుమానితుడి ఇంటికి వెళ్లింది. ఆ అనుమానితుడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. ఒక హత్యాయత్నం కేసులో బెయిలు పొందిన తర్వాత 2016, సెప్టెంబరు నుంచి అతను పరారీలో ఉన్నాడని సీబీఐ అదికారులు గుర్తించారు. ఆ అనుమానితుడి తల్లిదండ్రులకు సీఎఫ్ఎస్ఎల్ నిపుణులు డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. నేరం జరిగిన చోట దొరికిన నమూనాలు వారి కుమారుడివేనని నిర్ధారించారు.
నిందితుడిని పట్టుకొన్న సీబీఐ
అనుమానితుడు తన కుటుంబసభ్యులతో మాట్లాడడం లేదు,. మొబైల్ ఫోన్ ను కూడ ఉపయోగించడం లేదు. నిందితుడు వేర్వేరు ఫోన్లతో సుమారు 80 మందితో మాట్లాడే అవకాశం ఉందని సీబీఐ అధికారులు గుర్తించారు. నిందితుడు ఏ ఫోన్ నుండి మాట్లాడాడో ట్రాక్ చేసింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సిమ్లా సమీపంలోని రోహరు ప్రాంతంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న అనిల్కుమార్ను గుర్తించి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అతడికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. మృతదేహంపై దొరికిన నమూనాలతో అనిల్కుమార్ డిఎన్ఏ పోలీకలు సరిపోయాయి. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.