బెంగళూరు ఎమ్మెల్యే రోషన్ బేగ్ సస్పెండ్: బఫూన్, ప్లాప్ షో, ఎన్డీఏకి మద్దతు ఇస్తాం, ప్రభుత్వం !
న్యూఢిల్లీ /బెంగళూరు: కర్ణాటకలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బెంగళూరులోని శివాజీనగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ కార్యకలపాలకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని అనేక సార్టు హెచ్చరించినా, షోకాజ్ నోటీసులు జారీ చేసినా పట్టించుకోని ఎమ్మెల్యే రోషన్ బేగ్ మీద పార్టీ హై కమాండ్ వేటు వేసింది. రోషన్ బేగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేపీసీసీకి అనుమతి ఇచ్చింది. ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని కేపీసీసీ ప్రధాన కార్యదర్శి మీడియాకు తెలిపారు.
హై కామండ్ తో చర్చలు
సీనియర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయన మీద చర్యలు తీసుకునే విషయం పరిశీలించాలని కేపీసీసీ నాయకులు అనేక సార్ల కాంగ్రెస్ పార్టీ హై కామాండ్ కు ఫిర్యాదు చేశారు. రోషన్ బేగ్ మీద కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ షిర్యాదు చేశారు.
వేణుగోపాల్ బఫూన్
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ బఫూన్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అహంకారి, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ పనికిమాలిన వ్యక్తి, ప్లాప్ అధ్యక్షుడు అంటూ ఎమ్మెల్యే రోషన్ బహిరంగంగా విమర్శలు చేశారు. ఇలాంటి నాయకులు ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ ఉద్దారం కాదని రోషన్ బేగ్ అన్నారు. శాసన సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి 79 ఎమ్మెల్యేల సీట్లు రావడానికి కేవలం లింగాయుత్ వర్గీయులను విభజించడమే కారణం అని ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఆరోపించారు. లింగాయుత్ వర్గీయులను విభజించడం వలన 25 నుంచి 30 శాసన సభ స్థానాల్లో ఓడిపోయామని, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను పక్కన పెడుతున్నారని ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఆరోపించారు.
ఎన్డీఏకి మద్దతు ఇస్తాం
సమయం, సందర్బం చూసి మేము (ముస్లీంలు) సరైన నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే రోషన్ బేగ్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. అవసరమైతే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి మద్దతు ఇవ్వడానికి వెనకడుగు వెయ్యమని రోషన్ బేగ్ అన్నారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, కేసీ వేణుగోపాల్ కారణమని లోక్ సభ ఎన్నికల ముందే ఎమ్మెల్యే రోషన్ బేగ్ చెప్పారు.
షోకాజ్ నోటీసు చూడను
ఆత్మాభిమానం కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే మాత్రం తమ మద్దతు ఉంటుందని, ఆపార్టీ ప్రచారం చూసి అది పక్కా ప్లాప్ అని తాను ముందే హెచ్చరించానని, అయినా హైకమాండ్ పట్టించుకోలేదని రోషన్ బేగ్ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కేవలం ఒక్క నియోజక వర్గంలో మాత్రమే ముస్లీంలు పోటీ చెయ్యడానికి అవకాశం ఇచ్చిందని అనేక మీడియాలో గతంలోనే ప్రచారం జరిగిందని రోషన్ బేగ్ గుర్తు చేశారు. పార్టీ నాయకులను విమర్శించానని తనకు షోకాజ్ నోటీసు వస్తుందని ముందే ఊహించానని, అందులో ఏముంది అని తాను చూడనని, రోషన్ బేగ్ అన్నారు. తాను విమర్శించిన నాయకుల ఒత్తిడితో తనకు షోకాజ్ నోటీసులు వచ్చాయని రోషన్ బేగ్ అంటున్నారు.
గుర్రాల వ్యాపారం, ఐఏంఎ చీటింగ్ కేసు
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలతో గుర్రాల వ్యాపారం చేసిన వారికే మాత్రమే మంత్రి పదవులు వస్తున్నాయని రోషన్ బేగ్ ఆరోపించారు. పార్టీలో సీనియర్లను పక్కన పెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ పని అయిపోందని తాను ముందే చెప్పానని, అయినా వాళ్లు పట్టించుకోలేదని రోషన్ బేగ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ను ధిక్కరించిన సమయంలోనే ఐఎంఎ చీటింగ్ కేసు బయటకు వచ్చింది. ఐఎంఎ సంస్థతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే రోషన్ బేగ్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఐఎంఎ సంస్థ నుంచి రోషన్ బేగ్ కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఐఎంఎ చీటింగ్ కేసు పార్టీకి చెడ్డపేరు తీసుకువస్తుందని భయంతో రోషన్ బేగ్ ను పార్టీ నుంచి తప్పించారని కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు.