యడ్యూరప్ప, బళ్లారి రెడ్డి, శ్రీరాములు మీద ఏసీబీకి ఫిర్యాదు, ఎమ్మెల్యేకి రూ. 100 కోట్లు ఆఫర్!
బెంగళూరు: బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ రావ్, యడ్యూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేకి రూ. 100 కోట్లు ఆఫర్ ఇచ్చారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేలకు రూ. కోట్లు ఎర
మే 15వ తేదీన కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్, జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఈ నాయకులు అందరూ కోట్ల రూపాయాలు ఎర వెయ్యడానికి ప్రయత్నించారని కాంగ్రెస్ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
లీగల్ సెల్
బీజేపీ నాయకులు కర్ణాటకలో అధికారంలోకి రావడానికి ఎమ్మెల్యేలను గుర్రాలను కొనుగోలుచేసిట్లు కొనుగోలు చెయ్యాలని ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి బీజేపీ నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
ఆడియో క్లిప్పింగ్స్
బీఎస్. యడ్యూరప్ప బీసీ పాటిల్ తో మాట్లాడారని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దల్ తో మాట్లాడారని, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు, మురళీధర్ రావ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని ఆరోపిస్తూ వీఎస్. ఉగ్రప్ప విడుదల చేసిన ఆడియో క్లిప్పింగ్స్ సైతం ఏసీబీకి అప్పగించారు.
రూ. 100 కోట్లు
కర్ణాటక శాసన సభలో బీఎస్. యడ్యూరప్ప ఎమ్మెల్యేల బలపరీక్ష నిరూపించుకునే ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీఎస్. ఉగ్రప్ప బీజేపీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చెయ్యడానికి రూ. 100 కోట్లు ఎర చూపించారని ఆరోపిస్తూ ఆడియో విడుదల చేశారు.