లోకాయుక్తకు కొత్త చిక్కు: కుమారుడిపై మరో ఆరోపణ
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడు వై. అశ్విన్ రావ్ రూ. 20 లక్షలు లంచం తీసుకుని మోసం చేశారని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటి (కేపీసీసీ) సభ్యుడు పి.ఎన్. కృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు.
లోకాయుక్త రూ. ఒక కోటి లంచం కేసు దర్యాప్తు చేస్తున్నఎస్ఐటి( సిట్) అధికారులకు అందిన మొదటి ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఈ కేసులో సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన లింగ చిత్ర నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కాంగ్రెస్ శాసన సభ్యుడు (బెంగళూరు) మునిరత్నకు సంబంధం ఉందని ఫిర్యాదులో తెలిపాడు.
ఆస్తి వివాదం కేసు పరిష్కరించడానికి అశ్విన్ రావ్ రూ. 80 లక్షలు డిమాండ్ చేశాడని సమాచారం. అందుకు తాము సరే అన్నామని కృష్ణమూర్తి అంటున్నారు. తరువాత ముందస్తుగా రూ. 20 లక్షలు అశ్విన్ రావ్ కు అడ్వాన్స్ ఇచ్చామని చెప్పారు.
లోకాయుక్త కార్యాలయం పీఆర్ఓ రియాజ్ అహమ్మద్ చాంబర్ లోనే ఆ నగదు అశ్విన్ రావ్ కు ఇచ్చామని చెప్పారు. ఆ సందర్బంలో అశ్విన్ రావ్ రూ. 7 లక్షలు, అతని స్నేహితులు నరసింహారావ్ రూ. 3 లక్షలు, వి. భాస్కర్ (ఆర్ టీఐ కార్యకర్త) రూ. 10 లక్షలు పంచుకున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, ఎంఎల్ఏ మునిరత్నకు సంబంధం ఉందని ఆరోపించారు. పని పూర్తి చేస్తే మిలిగిన డబ్బు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని, పని చెయ్యకుండ తమను మోసం చేశారని, తమ డబ్బు తిరిగి ఇప్పించాలని కృష్ణమూర్తి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదే విషయంపై తాము పిణ్యా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, అందుకే సిట్ అధికారులకు ఫిర్యాదు చేశామని కృష్ణమూర్తి మీడియాకు చెప్పారు. ఇప్పటికే కష్టాలలో కూరుకుపోయిన లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కు మళ్లి ఒక కొత్త చిక్కు వచ్చి పడింది.