లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు లేవు, మీ అదృష్టాన్ని: కేపీసీసీ క్లారిటీ!
బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే విషయంలో తమ పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చిందని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కొందురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాల ఉత్సాహంగా ఉన్నారు.
కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరుత్సాహానికి గురౌతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనంతరంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ సూచించే అవకాశం ఉందని సమాచారం.
కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు
కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇంకా నిర్ణయించలేదు. తమకు 12 సీట్లు కేటాయించాలని జేడీఎస్ పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు.
సీనియర్ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు శాసన సభ్ములు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని శివాజీనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రిజ్వాన్ అహమ్మద్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందువలనే కేపీసీసీ అధ్యక్షుడు లోక్ సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వమని చెప్పారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు
ఇటీవల కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించే వారికే టికెట్లు కేటాయించాలని హైకమాండ్ నిర్ణయించిందని అన్నారు. టిక్కెట్లు సంపాధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని కేసీ. వేణుగోపాల్ స్పష్టం చేశారు.
బరిలో మంత్రి కృష్ణభైరే గౌడ !
బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు ? అనే చర్చ చాల రోజుల నుంచి జరుగుతోంది. జేడీఎస్ పార్టీతో పొత్తు విషయంలో ఓ నిర్ణయానికి వస్తే బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక మంత్రి కృష్ణభైరే గౌడ పోటీ చేస్తారని సమాచారం. బెంగళూరులోని బ్యాటరాయణపుర ఎమ్మెల్యే అయిన కృష్ణభైరే గౌడ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కృష్ణభైరే గౌడ చాల సన్నిహితుడు.
సిద్దరామయ్య ప్లాన్
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను పోటీ చేయించిన ఉదాహరణలు ఉన్నాయి. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రకాష్ హుక్కేరి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం సిద్దరామయ్య మంత్రి వర్గంలో ప్రకాష్ హుక్కేరి మంత్రిగా పని చేశారు. 2014లో జరిగిన లోక్ సభ ఎన్పికల్లో ప్రకాష్ హుక్కేరి పోటీ చేశారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.