బీజేపీకి మద్దతు ఇచ్చిన కేపీజేపీ ఎమ్మెల్యే, బీజేపీలో చిగురిస్తున్న ఆశలు, కాంగ్రెస్, జేడీఎస్ అలర్ట్!
బెంగళూరు: కర్ణాటకలో 104 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే (కేపీజేపీ) మద్దతుప్రకటించారు. ఒక్క ఎమ్మెల్యే బయట నుంచి మద్దతు ప్రకటించడంతో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీలో ఆశలు చిగురిస్తున్నాయి.
కేపీజేపీ పార్టీ టిక్కెట్
కర్ణాటకలోని హావేరీ జిల్లా రాణేబెన్నూరు శాసన సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ (కేపీజేపీ) నుంచి ఆర్. శంకర్ పోటీ చేశారు. రాణేబెన్నూరు శాసన సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు కేబీ. కోళివాడ పోటీ చేశారు.
కాంగ్రెస్ పై విజయం
రాణేబెన్నూరు శాసన సభ నియోజక వర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేబీ, కోళివాడ మీద కేపీజేపీ అభ్యర్థి ఆర్. శంకర్ విజయం సాధించారు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే కేఎస్. ఈశ్వరప్పకు ఆర్. శంకర్ బంధువు.
గాలి సన్నిహితులు
గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితులకు, ఆర్, శంకర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆర్. శంకర్ ను బీజేపీలోకి లాక్కొన్నారు. ఆర్. శంకర్ తో పాటు హైదరాబాద్ కర్ణాటకకు చెందిన జేడీఎస్ నాయకుల మీద గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు దృష్టిసారించారు.
కాంగ్రెస్, జేడీఎస్ అలర్ట్
బీజేపీ అధికారంలోకి రావడానికి ఇంకా 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాణేబెన్నూరు ఎమ్మెల్యే ఆర్. శంకర్ మద్దతు ఇవ్వడంతో మిగిలిన 7 మంది ఎమ్మెల్యేల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఎమ్మెల్యేలు జారీపోకుండా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.