12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇచ్చిన సీఎం సిద్దూ, గెలుపు ముఖ్యం, డోంట్ కేర్ !
బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి రావాలని కలలుకంటున్న కాంగ్రెస్ పార్టీ 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వలేదు. 12 మంది శాసన సభ్యులను పక్కనపెట్టిన కాంగ్రెస్ కొత్త వారు పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించింది.
218 నియోజక వర్గాలు
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా తీవ్రస్థాయిలో కసరత్తులు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి 218 శాసన సభ నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లును ప్రకటించింది. మిగిలిన ఆరు శాసన సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ పెండింగ్ పెట్టింది.
కుటుంబ సభ్యులకు టిక్కెట్లు
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతారని తెలుసుకుని వారికి టిక్కెట్లు కేటాయించలేదని తెలిసింది.
కాంగ్రెస్ డోంట్ కేర్
శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తమకు అవకాశం కల్పించలేదని తెలుసుకున్న అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అయితే సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు.
బళ్లారి ఎమ్మెల్యేకి మొండిచెయ్యి
బళ్లారి గ్రామీణ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.వై, గోపాలకృష్ణకు కాంగ్రెస్ పార్టీ మొండిచెయ్యి ఇచ్చింది. చిత్రదుర్గ జిల్లా మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన ఎన్.వై, గోపాలకృష్ణ 2013లో జరిగిన ఎన్నికల్లో ఆ నియోజక వర్గంలో ఓడిపోయారు.
శ్రీరాములు రూపంలో !
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బళ్లారి నుంచి శ్రీరాములు పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి వరకూ బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీరాములు తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా కొనసాగుతున్నారు. శ్రీరాములు రాజీనామా రూపంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్.వై, గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.