కృష్ణా జల వివాదంపై తుది విచారణ: తెలంగాణది తప్పని కర్నాటక
హైదరాబాద్: కృష్ణా జల వివాదంపై బుధవారం సుప్రీంకోర్టులో తుది విచారణ జరగనుంది. జల వివాదానికి సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు అత్యంత కీలకం కానుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ మధ్యంతర, తుది తీర్పును వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ లీవ్ పిటిషన్లు (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. తుది తీర్పులో కొన్ని మార్పులను కోరుతూ కర్ణాటక కూడా ఎస్ఎల్పీ దాఖలు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన ఎస్ఎల్పీలలో రాష్ట్ర విభజన తర్వాత భాగస్వామిగా చేరిన తెలంగాణ, తమకు బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునళ్లలో అన్యాయం జరిగిందంటూ రెండు ఎస్ఎల్పీలను వేసింది. మొత్తం ఐదు ఎస్ఎల్పీలను కలిపి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ముందు నాలుగు రాష్ట్రాలూ తమ వాదనలు, సమాధానాలు, వివరణలను సమర్పించాయి.
జల వివాదాలకు సంబంధించిన ఈ అంశం ఎక్కువ రోజులు కొనసాగడం సరికాదని, అన్ని రాష్ట్రాలు తమ వాదనలతో మూడు పేజీలకు మించకుండా సమర్పించాలని, వీటి ఆధారంగా తుది విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ఇదంతా ఎస్ఎల్పీలను విచారణకు స్వీకరించాలా లేదా అన్న దాని పైనే. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు రా్ట్రాలు మూడేసి పేజీల చొప్పున సమర్పించాయి.
కాగా, అంతకుముందు 122 పేజీలతో సుప్రీంకు కర్నాటక నివేదికలు సమర్పించింది. తెలంగాణ వాదన సరైంది కాదని, ట్రైబ్యునళ్లను మళ్లీ తెరిపించాలని చూస్తోందని, కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర ఎస్ఎల్పీలను పరిగణలోకి తీసుకోవద్దని కర్నాటక సుప్రీంలో నివేదికను సమర్పించింది.
జలవనరులను ప్రాంతీయ అంశాల ఆధారంగానే కేటాయిస్తారన్న అభిప్రాయంతో తెలంగాణ ఉందని, ఇది సరైన వైఖరి కాదని కర్నాటక రాష్ట్రం పేర్కొంది.
1956 అంతర్ రాష్ట్ర జలవనరుల చట్టం ప్రకారం పరివాహక ప్రాంతంలోని రాష్ట్రం మొత్తాన్ని పరిగణలోకి తీసుకొంటారని పేర్కొంది. నీటి కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని, కృష్ణా జలాలపై మళ్లీ విచారణ జరిపి తమ వాదన వినాలని పేర్కొంటూ తెలంగాణ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీ విచారణకు స్వీకరించాల్సిన అవసరం లేదని గతంలోనే కర్నాటక సుప్రీం కోర్టుకు నివేదించింది.
తాజాగా ఎందుకు పరిగణలోకి తీసుకోరాదో పేర్కొంటూ 122 పేజీలతో కూడిన రెండు నివేదికలను సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 ముందు తమ వాదనను వినిపించే అవకాశం కలగలేదని తెలంగాణ పేర్కొనడం సరికాదని, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89ను విశ్లేషించడం ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) పరిధిలోకి రాదని నివేదికలో స్పష్టం చేసింది.