64 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక - బీహార్ పోల్స్తోపాటే నిర్వహిస్తామన్న ఈసీ
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబందించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలతోపాటు ఆయా రాష్ట్రాల్లోని 64 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. శుక్రవారం ఈసీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కరోనా వల్ల ఎన్నికల వాయిదా కుదరదు - ఈసీని ఆదేశించలేం - బీహార్ పోల్స్పై సుప్రీం కోర్టు
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ 29తో ముగియనుంది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పోల్స్ వాయిదా వేయాలంటూ పలు వర్గాలు డిమాండ్ చేశాయి. ఎన్నికల వాయిదాకు నో చెప్పిన ఈసీ.. షెడ్యూల్ ప్రకారమే పోల్స్ నిర్వహిస్తామని, కరోనా పరిస్థితులకు అనుగుణంగా సకల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. బీహార్ సాధారణ ఎన్నికలతోపాటే దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకూ ఉప ఎన్నికలు నిర్వహించాలని శుక్రవారం నిర్ణయించింది. దీనికి సంబంధించి షెడ్యూల్ ను సరైన సమయంలో విడుదల చేస్తామని ఈసీ తెలిపింది.
సమస్యాత్మక రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ తోపాటే దేశవ్యాప్తంగా 65 స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు సరిపడా కేంద్ర బలగాల కేటాయింపు, ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, కరోనా వ్యాప్తి తదితర అంశాలపైనా ఎన్నికల సంఘం చర్చించింది. వరదలు, కరోనా వ్యాప్తి లాంటి అవరోధాల కారణంగా ఉప ఎన్నికలు ఇప్పుడప్పుడే వద్దంటూ వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఇచ్చిన నివేదికలను సైతం ఈసీ పరిశీలించింది. అయితే, చివరికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, బీహార్ తోపాటే చేపడుతామని ఈసీ ప్రకటించింది.
Recommended Video
బీహార్ సాధారణ ఎన్నికలతోపాటు ఉప ఎన్నికలుజరిగే 65 స్థానాల్లో 64 అసెంబ్లీ సీట్లుకాగా, ఒక లోక్ సభ నియోజకవర్గం కూడా ఉంది. కన్యాకుమారి(తమిళనాడు) కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ ఇటీవల కరోనాతో మృతిచెందడంతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది. అన్నింటికీ కలిపి సరైన సమయంలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఈసీ తెలిపింది.