కరుణానిధి మృతి: కర్ణాటక-తమిళనాడు సరిహద్దుల్లో హై అలర్ట్, కేఎస్ఆర్ టీసీ బస్సులు!
చెన్నై/బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ డాక్టర్ ఎం. కరుణానిధి మరణవార్త తెలిసిన వెంటనే తమిళనాడు- కర్ణాటక సరిహద్దులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక- తమిళనాడు అంతరాష్ట్ర బస్సులు సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు.
తమిళనాడు రాజధాని చెన్నైతో సహ ఆ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే అన్ని కేఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిపి వేశారు. తమిళనాడు సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించారు. బెంగళూరు సరిహద్దులోని హోసూరు రోడ్డులోని అత్తి బెలె, కోలారు జిల్లా, చామరాజనగర్ జిల్లా, బెంగళూరు గ్రామీణ జిల్లా సరిహద్దులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే తమిళనాడులో ఉన్న కేఎస్ఆర్ టీసీ బస్సు సర్వీసులు సైతం నిలిపివేశారు. తమిళనాడులో కేఎస్ఆర్ టీసీ బస్సులకు పోలీసులు బందోబస్తు కల్పించారు. తమిళనాడులోని కర్ణాటకకు చెందిన హోటల్స్, లాడ్జ్ లు, వ్యాపారలావాదేవీల సంస్థల దగ్గర పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
బెంగళూరు నగరంతో పాటు కోలారు జిల్లాలోని కేజీఎఫ్ లో తమిళ ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో తమిళ చిత్రాల ప్రదర్శన మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు.
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న తమిళ సోదరులు, డీఎంకే పార్టీ కార్యకర్తలు కరుణానిధికి నివాళులు అర్పించారు. కరుణానిధికి మరణం లేదని, ఆయన మా గుండెల్లో పదిలంగా ఉన్నారని బెంగళూరులో డీఎంకే కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.