గాడ్సే దేశభక్తుడా : సాధ్వి వ్యాఖ్యలపై కేటీఆర్, అబ్దుల్లా గుస్సా, భేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్
హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథూరం గాడ్సేను దేశభక్తుడని బీజేపీ నేత సాద్వీ ప్రజ్ఞాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో .. బీజేపీ కూడా స్పందించింది. జరిగిన ఘటనపై వివరణ కోరామని .. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది.
గాడ్సే దేశభక్తుడే ...
ఇప్పటికే పలు వివాదాస్పద కామెంట్లు చేసిన సాద్వీ .. తాజాగా గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశభక్తుడిగానే ఉంటారని చేసిన వ్యాఖ్యలపై పార్టీలకతీతంగా నేతలు స్పందించారు. సాద్వీ వ్యాఖ్యలు సరికావని కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. జాతి పితను కాల్చిన గాడ్సేను దేశ భక్తుడు అనడం ఏంటని ప్రశ్నించారు. ఇదే అంశంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్టయ్యారు. గాడ్సే దేశభక్తుడని సాద్వీ అనడం సరికాదని ట్వీట్ చేశారు. వివిధ అంశాలపై రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు .. కానీ ప్రతిదానికి హద్దులు ఉంటాయని చెప్పారు. సాద్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్లతో యావత్ జాతి ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆత్మరక్షణలో బీజేపీ ...
సాద్వీ వ్యాఖ్యలతో బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడింది. ఈ అంశంపై వివరణ కోరుతామని ఆ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అంతేకాదు గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గానూ బహిరంగ క్షమాపణ చెప్పాలని అభిప్రాయపడ్డారు.
కమల్తో షురూ ...
ఇటీవల్ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో గాడ్సే కామెంట్ల వివాదం రేగింది. స్వతంత్ర దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని గాడ్సేను ఉద్దేశించి కమల్ అన్నారు. తమిళనాడులోని అరవకురిచిలో ముస్లింల ప్రాబల్యం ఉన్న చోట వ్యాఖ్యలు చేశారు. దానికి కొనసాగింపుగా సాద్వీ గాడ్సే దేశభక్తుడని ఉదహరించారు. కమల్ వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది. అయితే బీజేపీ నేత కామెంట్లపై రాజకీయ నేతల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయ. దీంతో ఆమెపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది.