కేటీఆర్ వాక్చాతుర్యం, హరీష్ రావు పబ్లిక్ ఫిగర్: వారసత్వానికి తెరపడినట్లే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అసెంబ్లీ రద్దు చేసిన సమయంలో వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి, తన కొడుకు కేటీ రామారావును సీఎం పీఠంపై కూర్చుండ బెట్టే అవకాశాలు కొట్టిపారేయలేమనే వార్తలు వచ్చాయి. అయితే కేసీఆర్ మాత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి, కేటీఆర్కు అప్పుడే 'ముఖ్య'మైన పగ్గాలు ఇప్పుడే కాదని తేల్చి చెప్పారు.
అదే సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా శుక్రవారం కేటీఆర్ను నియమించి తెరాసలో ఆయనే నెంబర్ 2 అని తేల్చేశారు. అంతేకాదు, తాను ఇక ముందు జాతీయ రాజకీయాల్లో బీజిగీ ఉండబోతున్నానని, పార్టీని అంతటినీ కేటీఆర్ చూసుకుంటారని చెప్పారు. తద్వారా భవిష్యత్తులో 'ముఖ్య' పదవి కేటీఆర్కు అని చెప్పకనే చెప్పే సంకేతాలు అని భావిస్తున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)
'ముఖ్య' పదవి వ్యూహంలో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్
పార్టీలో కేటీఆర్ కీలక రోల్ పోషిస్తారని చెప్పినప్పటికీ, పాలనలోను ఆయన పాత్ర ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెబుతున్నారు. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తారని అంటున్నారు. కేటీఆర్కు 'ముఖ్య' పదవి వ్యూహంలో భాగంగానే కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారని భావిస్తున్నారు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
కేసీఆర్ తర్వాత.. హరీష్, కేటీఆర్
2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కేబినెట్లో హరీష్ రావు, కేటీఆర్లు మంత్రులుగా ఉన్నారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చారు. తెరాస ప్రభుత్వం మొదటిసారి ఏర్పడిన అనంతరం కేసీఆర్ తర్వాత ఎవరు అనే చర్చ చాలాకాలం పాటు సాగింది. హరీష్ రావా, కేటీఆరా అనే చర్చ సాగింది. కేసీఆర్ వారసత్వం హరీష్ రావుది అని కొందరు, కేటీఆర్ది అని మరికొందరు భావించారు. అయితే తెరాస నేతలు మాత్రం మరో 20 ఏళ్లు కేసీఆర్ ఉంటారని, కాబట్టి కేసీఆర్ తర్వాత ఎవరనే చర్చకు అర్థం లేదని వ్యాఖ్యానిస్తూ వచ్చారు.
ఉద్యమంలో హరీష్ రావు, కేటీఆర్కు ఎక్కువ ప్రాధాన్యత
ఇప్పుడు కేసీఆర్ అనూహ్యంగా కేటీఆర్ను తెరపైకి తీసుకు వచ్చారు. గతంలో తెరాస నేతలు చెప్పినట్లు మరో ఇరవై ఏళ్లు కేసీఆర్ రాష్ట్రంలో కీలకంగా ఉంటారా అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. కానీ పరోక్షంగా కేటీఆర్ను మాత్రం వారసుడిగా తేల్చేశారని అంటున్నారు. ఉద్యమంలో హరీష్ రావు తన మామ కేసీఆర్ వెన్నంటి ఉన్నారు. అయితే తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం క్రమంగా హరీష్ రావు కంటే కేటీఆర్కు ప్రాధాన్యత పెరిగిందనే వాదనలు ఉన్నాయి. ఐటీ, పంచాయతీరాజ్ వంటి పలు శాఖలను కేటీఆర్కు అప్పగించారు.
కేటీఆర్ వాక్చాతుర్యం, హరీష్ రావు పబ్లిక్ ఫిగర్
తెరాస తొలి ప్రభుత్వంలో కేటీఆర్ కీలకంగా మారారనే ప్రచారం ఉంది. పలు బిజినెస్ సమ్మిట్ వంటి వాటిల్లో ఆయనే క్రియాశీలకంగా ఉండేవారు. కేసీఆర్ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. ఇక తెలంగాణలో హరీష్ రావుకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. సిద్దిపేటలో ఆయనకు ఉన్న అనుచరగణాన్ని పక్కన పెడితే తెలంగాణవ్యాప్తంగా కూడా ఆయనకు ఉందని గుర్తు చేస్తున్నారు. ఆయన సాఫ్టునెస్ అందరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.
అక్కడ కొడుకులు నిలబడ్డారు
ఇదిలా ఉండగా, తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు కీలకంగా ఉన్నారని జాతీయ మీడియాలోను వార్తలు వస్తున్నాయి. అతను మౌనంగానే ఉంటారా అనే కోణంలోను చర్చలు సాగుతున్నాయి. ఓపికగా సమయం కోసం చూస్తున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పుడు కేటీఆర్కు కీలక పదవి అప్పగించడం ద్వారా కేసీఆర్ వారసుడు తేలిపోయిందని, అయితే ఈ ఇష్యూ ఇంతడితో ముగిసినట్లేనా అనే చర్చ సాగుతోంది. తమిళనాడులో స్టాలిన్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే, యూపీలో అఖిలేష్ యాదవ్, పంజాబ్లో సుఖ్బీర్ సింగ్ బాదల్... అక్కడ వారసత్వ పోరులో కొడుకులే నిలబడ్డారని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, హరీష్ రావు మాత్రం కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాగానే శుభాకాంక్షలు తెలిపారు... స్వాగతించారు. కాబట్టి ఇక్కడ అలాంటి పోరు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు.కేటీఆర్ నియామకం పట్ల హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉదయమే కేటీఆర్కు శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. భవిష్యత్లో కేటీఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్కు కేటీఆర్ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మరింత బాగా పని చేయాలని, తెరాసను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో తన సంపూర్ణమైన సహకారాన్ని కేటీఆర్కు అందిస్తానని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను, కేటీఆర్ కలిసి పని చేశామని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలోనూ కలిసే పని చేస్తామని చెప్పారు. తెలంగాణలో కేటీఆర్, హరీష్ రావులు కలిసి ముందుకు సాగుతారని వారి మాటలను బట్టి అర్థమవుతోందని చెబుతున్నారు.