ఐసీజే చెప్పిందేమిటి..పాక్ చేస్తున్నదేమిటి: కాన్సులర్ యాక్సెస్ విషయంలో భారత్ సీరియస్
న్యూఢిల్లీ: కుల్భూషణ్ జాదవ్కు రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడం జరగదని పాకిస్తాన్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భారత్ స్పందించింది. ఈ సమస్యకు పరిష్కారం దౌత్యపరంగానే కనుగొంటామని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అమలు అయ్యేందుకు తాము ప్రయత్నిస్తామని రవీష్ కుమార్ తెలిపారు. దౌత్య మార్గాల ద్వారా ఈ అంశంపై పాకిస్తాన్తో టచ్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని రవీష్ కుమార్ చెప్పారు.
ఇక ఐక్యరాజ్యసమితి మానవహక్కు కమిషన్ సమావేశంలో భారత్ వ్యవహారంపై కూడా వివరణ ఇచ్చారు రవీష్ కుమార్. పాకిస్తాన్ పచ్చి అబద్ధాలు చెప్పిందని అయితే వాటిని సమర్థవంతంగా భారత అధికారులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఉగ్రవాదులకు అన్ని సహాయ సహకారాలు పాకిస్తాన్ చేస్తుందన్న విషయం అంతర్జాతీయ సమాజంకు తెలుసునని రవీష్ కుమార్ చెప్పారు. ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజంగా చిత్రీకరించాలని చూస్తోందని చెప్పారు. అయితే పాక్ తీరు ఏంటో ప్రపంచదేశాలకు తెలుసునని రవీష్ కుమార్ చెప్పారు. కర్తాపూర్ కారిడార్ నిర్మాణం సందర్భంగా పాకిస్తాన్ అడ్డుపడుతోందని రవీష్ కుమార్ చెప్పారు.
అంతర్జాతీయ న్యాయస్థానం కుల్భూషణ్ జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని తీర్పునివ్వడంతో సెప్టెంబర్ 2వ తేదీన తొలిసారిగా కుల్భూషణ్ జాదవ్ను పాకిస్తాన్లో భారత డిప్యూటీ హైకమిషనర్ కలిశారు. అంతకుముందు నిబంధనలు షరతులపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగడంతో కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడంలో జాప్యం జరిగింది. వియన్నా కన్వెన్షన్ ప్రకారం కుల్భూషణ్ జాదవ్కు కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాల్సిందే అని అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్ను ఆదేశించడంతో పాక్ అవకాశం కల్పించింది. అయితే ఎన్నిసార్లు ఇవ్వాలి అనేదానిపై న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేయలేదు.