భారీ భద్రతా ఏర్పట్ల మధ్య పాక్ జైల్లో కులభూషణ్ జాదవ్ను కలిసిన తల్లి, భార్య
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్:పాకిస్థాన్ జైల్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ను అతని తల్లి, భార్య సోమవారం కలుసుకున్నారు. సోమవారం ఉదయం ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ కుటుంబసభ్యులు.. పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్ కూడా ఉన్నారు.
మొదట ఇస్లామాబాద్లోని భారత దౌత్య కార్యాలయం చేరుకున్న జాదవ్ తల్లి, భార్య.. అక్కడి నుంచి పాక్ విదేశాంగా కార్యాలయంలో ఆయనను కలిశారు. దాదాపు 30నిమాషాలపాటు వారు జాదవ్తో మాట్లాడారు. దాదాపు 21నెలల తర్వాత జాదవ్ తన కుటుంబసభ్యులను కలుసుకోవడం గమనార్హం.
కాగా, జాదవ్తో భేటీ ముగిసిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం జాదవ్ తల్లి, భార్య భారత్కు రానున్నారు. జాదవ్ తల్లి, భార్య రాక సందర్భంగా పాక్ విదేశాంగ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. భారీ భద్రత మధ్య జాదవ్ తల్లి, భార్య కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
#WATCH: Wife, mother of Kulbhushan Jadhav reach Pakistan Foreign Affairs Ministry in Islamabad along with JP Singh, Deputy High Commissioner pic.twitter.com/Dnp9eUc5je
— ANI (@ANI) December 25, 2017
యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, షార్ప్ షూటర్లను భద్రత కోసం నియమించారు. విదేశాంగ కార్యాలయం సమీపంలో మీడియా, భద్రతాసిబ్బంది మినహా ఇతర వాహనాలకు అనుమతినివ్వలేదు.కాగా, జాదవ్కు భారత గూఢచారి అనే ఆరోపణలతో పాకిస్థాన్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ న్యాయస్థానం పాక్ కోర్టు తీర్పుపై స్టే విధించింది.
ఇదిలా ఉండగా జాదవ్ను కలిసేందుకు భారత అధికారులకు పాకిస్థాన్ కాన్సులర్ యాక్సెస్ ఇచ్చినట్లు ఈ ఉదయం వార్తలు వచ్చాయి. అయితే తమకు ఎలాంటి అనుమతులు రాలేదని భారత అధికారులు చెప్పారు. దీంతో ఈ విషయంపై సందిగ్ధత నెలకొనడంతో పాక్ విదేశాంగ శాఖ దీనిపై స్పష్టతనిచ్చింది. ఇది కేవలం కుటుంబసభ్యులతో సమావేశం మాత్రమేనని.. ఎలాంటి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వలేదని వెల్లడించింది.
ఇది ఇలావుండగా, కుల్భూషణ్ జాదవ్కు మద్దతుగా ఆయన స్నేహితులు ఆదివారం ముంబైలో బైక్ ర్యాలీ, వందలాది మంది కలిసి మానవహారం నిర్వహించారు. జాదవ్ను విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్థర్ రోడ్ నుంచి బయలుదేరిన ప్రదర్శన దక్షిణ ముంబైలోని కర్రే రోడ్ వరకు కొనసాగింది.