కుల్భూషణ్ జాదవ్ కేసు: తాళి తీయించారు.. చెప్పులూ ఇవ్వలేదు.. ఇదీ పాక్ తీరు!
న్యూఢిల్లీ: తమ జాతి పిత పుట్టిన రోజు.. మానవతా దృక్పథం అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన పాకిస్తాన్.. కుక్క తోక వంకర అన్నట్లు మళ్లీ కుల్భూషణ్ జాదవ్ వ్యవహారంలో తన నిజ స్వరూపాన్నే చాటుకుంది.
అద్దాల గదిలో.. నిఘా నీడలో, జాదవ్ను కళ్లారా చూసి.. చలించిపోయిన తల్లీ భార్య!
కుల్భూషణ్ జాదవ్ను కలిసేందుకు ఆయన భార్య, తల్లిని అనుమతించిన పాక్.. వాళ్లతో ఎంత దారుణంగా వ్యవహరించిందో ఇండియా వెల్లడించింది. రెండు దేశాల మధ్య ఉన్న అవగాహనకు విరుద్ధంగా ఈ సమావేశం జరిగిందని స్పష్టంచేసింది.
'భద్రతా కారణాలంటూ వాళ్లతో దారుణంగా వ్యవహరించారు. వాళ్ల మత, సాంప్రదాయాలకు కనీస విలువ ఇవ్వలేదు. కుల్భూషణ్ భార్య మంగళసూత్రం, గాజులు, బొట్టు తీయించారు. భద్రతకూ దీనికీ సంబంధం ఏంటి?' అని పాకిస్తాన్ను ఇండియా నిలదీసింది.
వాళ్లను కనీసం మాతృభాషలో మాట్లాడనివ్వలేదని, పదేపదే అడ్డుపడ్డారని ఆరోపించింది. సమావేశం తర్వాత జాదవ్ భార్య చెప్పులు కూడా తిరిగి ఇవ్వలేదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చనే అనుమానం తమకు ఉందని.. భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
కుల్భూషణ్ కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారని, నిర్బంధంలో ఉన్నట్లుగా ఆయన మాట్లాడారని, జాదవ్ పరిస్థితి చూస్తుంటే.. ఆరోగ్యం కూడా సరిగా ఉన్నట్లు అనిపించలేదని అనుమానం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్లో తాను విద్రోహ చర్యలకు పాల్పడినట్లుగా బెదిరించి ఆయనతో చెప్పించినట్లు తెలుస్తోందని రవీష్ స్పష్టంచేశారు. సోమవారం కుల్భూషణ్ను కలిసి తిరిగి స్వదేశానికి వచ్చిన ఆయన తల్లి, భార్య.. మంగళవారం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కలవడంతో పాక్ అధికారుల ప్రవర్తనకు సంబంధించి మరింత సమాచారం అందింది.
#WATCH MEA spokesperson Raveesh Kumar on meeting of #KulbhushanJadhav's mother and wife with Jadhav in Islamabad pic.twitter.com/O6HkKoc7WK
— ANI (@ANI) December 26, 2017