ఇంక్ కాదు, సైనికుల రక్తం: శివసేన, అద్వానీ ఆగ్రహం
ముంబై/న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరీ పుస్తకావిష్కరణ నేపథ్యంలో.. మాజీ దౌత్యవేత్త, రచయిత సుదీంధ్ర కులకర్ణి పైన శివసేన ముఖానికి ఇంక్ పూసింది. దీనిపై శివసేన స్పందించింది.తాము వారి పైన పూసింది సిరా కాదని, అది భారత సైనికుల రక్తం అని పేర్కొంది.
ఖుర్షీద్ కసూరి రాసిన పుస్తకావిష్కరణ సోమవారం ముంబైలో జరిగింది. అంతకు ముందు, అబ్జర్వర్ అండ్ రీసర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు సిరాతో దాడి చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, కులకర్ణి ముఖంపై సిరా పోశారు.
అనంతరం, జరిగిన ఘటనపై శివసేన స్పందించింది. తమ కార్యకర్తలు చేసిన పని సరైందేనని శివసేన నేతలు స్పష్టం చేశారు. కులకర్ణి ముఖంపై పోసింది సిరా కాదని... భారత సైనికుల రక్తమని చెప్పారు. సిరా పూయడం చాలా సున్నితమైన అంశమన్నారు.
కాగా, శివసేన తీరు పైన పలువురు మండిపడ్డారు. దానికి ఆ పార్టీ కౌంటర్ ఇచ్చింది. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ.. శివసేన తీరును ఖండించారు.
ఇలాంటి ఘటనలతో దేశానికి చెడ్డపేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో భిన్నమైన అభిప్రాయాలకు అవకాశం ఉండాలని, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలన్నారు.
శివసేన చర్యలను ఖండించిన కిరణ్ రిజిజు
సుధీంద్ర కులకర్ణికి నల్లరంగు పూయడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ.. భౌతికంగా దాడికి దిగడం తప్పు అన్నారు. ఇలా దాడి చేసి నల్లరంగు పూయడం సరైన పద్ధతి కాదన్నారు.
అంతకుముందు, పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి చేసిన విషయం విదితమే. ఇంక్ మరకలతోనే కులకర్ణి ప్రెస్మీట్ పెట్టారు.
ఈ సందర్భంగా కులకర్ణి మాట్లాడుతూ.. పాక్ మాజీ మంత్రి కసూరి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని శివసేన బెదిరిస్తోందన్నారు. శివసేన బెదిరింపులకు భయపడేది లేదన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగి తీరుతుందన్నారు. కులకర్ణిపై ఇంక్ దాడి దురదృష్టకరమని పాక్ మాజీ మంత్రి కసూరి పేర్కొన్నారు.