జేడీఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎం
బెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్ కమిషన్, ఆదాయపన్ను శాఖ వరుస దాడులతో కర్నాటక సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈసీ, ఐటీ అధికారులు పదేపదే సోదాలు నిర్వహిస్తుండటంపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్న సంస్థలు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు.
మోడీకి సమాధానం చెప్పడానికి రెఢీ, అత్యుత్సాహం, ఐటీ హబ్ కు ఏం చేశారు: మాజీ ప్రధాని!
కాంగ్రెస్పై పద్మవ్యూహం
లోక్సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కొడుకు నిఖిల్ను ఓడించేందుకు కుట్ర జరుగుతోందని కుమారస్వామి ఆరోపించారు. తన కుమారుడు ఈ ఎన్నికల్లో గెలవకుండా కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు నిఖిల్కు బదులు స్వతంత్ర అభ్యర్థి, సినీ నటి సుమలతతో కుమ్మక్కయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాండ్యలో పరిస్థితి చేయిదాటిపోయిందన్న ఆయన.. జేడీఎస్ను అణగదొక్కేందుకు కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని ఆరోపించారు.
ఈసీ, ఐటీ వేధింపులు
ఇదిలాఉంటే వరుస దాడులు, తనిఖీలతో ఎలక్షన్ కమిషన్, ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్లు తనను టార్గెట్ చేస్తున్నాయని కుమారస్వామి ఆరోపించారు. ఉత్తర కన్నడ నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి ఆనంద్ అస్నోటికార్ నామినేషన్ దాఖలు అనంతరం కుమారస్వామి మీడియాతో తన ఆవేదన పంచుకున్నారు. విధి నిర్వాహణ పేరుతో ఈసీ, ఐటీ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు.
48 గంటల్లో 14సార్లు సోదాలు
ఈసీ, ఐటీ అధికారులు గత రెండు రోజుల్లో తన కారును 14సార్లు తనిఖీ చేశారని కుమారస్వామి వాపోయారు. గురువారం గోకర్ణ నుంచి కార్వార్కు చేరుకునేలోపు 60 కిలోమీటర్ల పరిథిలోనే రెండుసార్లు తనిఖీ జరిగిందన్నారు. తమ వాహనాలను తనిఖీ చేయాలని పోలీసులపై ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి తెస్తోందని కుమారస్వామి ఆరోపించారు.
బీజేపీ కుట్ర
తనను, తన కుటుంబాన్ని వేధించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కర్నాటక సీఎం విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే భారీగా అధికారులను బదిలీ చేశారని అన్నారు. ఏ శాఖలో ఏం జరుగుతుందో తెలియని కారణంగా పాలనపై పట్టు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పదే పదే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తోందని, ఇందులో భాగంగానే ఐటీ సోదాల పేరుతో వేధిస్తోందని కుమారస్వామి ఆరోపించారు.